Reading Time: < 1 minute
Russia Offers Boost Oil Gas Supply India West Asia War Crisis

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రష్యా భారత్‌కు కీలక ప్రతిపాదన చేసింది. భారత్‌కు అవసరమైన ముడి చమురు, సహజ వాయువు సరఫరాను మరింత పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది.

రష్యా డిప్యూటీ ప్రధాన మంత్రి డెనిస్ మాంటురోవ్ గురువారం న్యూఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్‌తో విడివిడిగా సమావేశమై చర్చలు జరిపారు.

ఇరాన్ యుద్ధం కారణంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గుండా రవాణా నిలిచిపోవడంతో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి. ఈ సంక్షోభం నుంచి భారత్‌ను గట్టెక్కించేందుకు రష్యా కంపెనీలు నిరంతరం చమురు, గ్యాస్ సరఫరా చేస్తాయని మాంటురోవ్ హామీ ఇచ్చారు. 2026 జనవరిలో రష్యా నుంచి భారత్ దిగుమతులు 19.3 శాతానికి పడిపోయాయి. అయితే ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి.. భారత్ మళ్ళీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను వేగంగా పెంచుతోంది.

Also Read:Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..

గత ఏడాది రష్యా భారత్‌కు ఎరువుల సరఫరాను 40 శాతం పెంచింది. భవిష్యత్తులో కూడా భారత రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులను అందించడానికి రష్యా మొగ్గు చూపుతోంది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ఏటా 100 బిలియన్ డాలర్ల వ్యాపారం జరగాలని ప్రధాని మోదీ, పుతిన్ గతంలోనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అణుశక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. మొత్తంగా చెప్పాలంటే, పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన ఇంధన కొరతను అధిగమించేందుకు రష్యా భారత్‌కు ఒక బలమైన భరోసాగా నిలిచింది.