పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం సామాన్యుడి నడ్డి విరిచేలా ఉంది. ఇప్పటికే మండిపోతున్న ధరలకు తోడు ఇప్పుడు ప్రాణావసరమైన మందుల రేట్లు కూడా ఆకాశాన్ని తాకనున్నాయి! ఔషధాల ముడిపదార్థాల కొరతతో వాటి ధరలు ఏకంగా 200 నుంచి 300 శాతం పెరిగిపోయాయి. ఇంకేముంది, త్వరలోనే మెడిసిన్ రేట్లు 180 శాతం వరకు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టేందుకు ఫార్మా కంపెనీలు రెడీ అవుతున్నాయి. అసలేం జరుగుతుందో క్లియర్ గా చూద్దాం..
యుద్ధం తెచ్చిన తంటా: రక్తపాతం సృష్టిస్తున్న పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలు కష్టంగా మారాయి. ఇక దీనివల్ల మన దేశానికి రావాల్సిన మందుల ముడిపదార్థాల (ఏపీఐ) సరఫరాకు తీవ్ర బ్రేకులు పడ్డాయి.
కొండెక్కిన ముడిసరుకు రేట్లు: సరఫరా తగ్గడంతో మందులు తయారుచేసే ముడిపదార్థాల ధరలు ఒక్కసారిగా 200 నుంచి 300 శాతం పెరిగాయి. కంపెనీలకు పెట్టుబడి భారం విపరీతంగా పెరిగిపోవడంతో, ఆ భారాన్ని మనలాంటి సామాన్య వినియోగదారులపైనే మోపాలని చూస్తున్నాయి.

ఏయే మందుల ధరలు పెరుగుతాయి?: మనం రోజువారీ వాడే అతి ముఖ్యమైన మందులన్నీ ఈ లిస్టులో వున్నాయి..జ్వరం వస్తే వేసుకునే పారాసెటమాల్, ఒళ్లు నొప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్స్,ఇన్ఫెక్షన్ల కోసం వాడే యాంటీ బయాటిక్స్,నిత్యం వాడాల్సిన బీపీ, షుగర్ టాబ్లెట్స్ ఇవి ధరలు పెరగనున్నాయి.
180 శాతం బాదుడు: ఈ ముడిసరుకుల రేట్ల పెరుగుదల వల్ల మనం కొనే మెడిసిన్స్ ధరలు ఏకంగా 180 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. అంటే నిన్నమొన్నటి వరకు వంద రూపాయలున్న మందుల బిల్లు కాస్తా.. ఇప్పుడు డబుల్ కంటే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
యుద్ధం ఎక్కడో జరుగుతున్నా, దాని ప్రభావం మాత్రం మన వంటింట్లోనూ, మెడిసిన్ బాక్సుల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధరలు అదుపు చేయకపోతే.. సామాన్యుడు జబ్బు పడితే ఆసుపత్రి ఖర్చులు దేవుడెరుగు, కనీసం టాబ్లెట్ కొనాలన్నా భయపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
The post ఫార్మా రంగానికి వార్ ఎఫెక్ట్.. మందులు కొనాలంటే జేబు ఖాళీ! appeared first on Manalokam – Latest Telugu News & Updates.