Reading Time: < 1 minute
స్టార్ హోటళ్ళలో సెమినార్లు, ప్రముఖ కేఫ్‌లలో పార్టీలు.. క్యూనెట్ కేసులో వెలుగులోకి సంచలనాలు..!

క్యూ నెట్ మోసం కేసులో సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో భాగంగా 32 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో 10 మందిని కస్టడీకి తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో బయటపడుతున్న అంశాలు ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న భారీ మోసం జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయి.

నిందితుల ప్రధాన టార్గెట్ ఐటీ రంగంలో పనిచేసే యువతీ యువకులే అని సిట్ దర్యాప్తులో తేలింది. ఒక్కో నిందితుడు కనీసం 500 మంది ఐటీ ఉద్యోగులను తమ నెట్‌వర్క్‌లోకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుని వ్యవహరించినట్లు గుర్తించారు. ఇందుకోసం స్టార్ హోటళ్లు, ప్రముఖ కేఫ్‌లలో సెమినార్లు నిర్వహిస్తూ ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్లతో బాధితులను ప్రభావితం చేసినట్లు వెల్లడైంది.

ముఖ్యంగా బ్యాంక్ లోన్లు ఇప్పించి పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టడం ఈ మోసగాళ్ల ముఖ్య వ్యూహంగా సిట్ గుర్తించింది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెడితే, కేవలం రెండేళ్లలో రూ.3 కోట్ల వరకు సంపాదించవచ్చని నమ్మబలికి అనేక మంది ఐటీ ఉద్యోగులను మోసం చేసినట్లు తేలింది. అయితే పెట్టిన డబ్బులకు ఎలాంటి లాభాలు రాకపోవడంతో బాధితులు ఇప్పటికీ ఈఎంఐలు కడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఇంకా షాకింగ్ అంశం ఏమిటంటే.. పెట్టుబడి పెట్టే ముందే ‘ఇక్కడ జరిగే విషయాలకు నాదే బాధ్యత’ అంటూ బాధితులతో బాండ్లు రాయించుకున్నట్లు సిట్ వెల్లడించింది. దీనివల్ల తర్వాత ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా ముందుగానే మోసానికి పునాది వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరు ఎదురు తిరిగినా… వారిపై తప్పుడు పోలీస్ కేసులు పెడతామని బెదిరింపులకు దిగినట్లు విచారణలో బయటపడింది.

ఈ వ్యవహారంపై సిట్ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇంకా ఎన్ని మంది బాధితులు ఉన్నారు? ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు మాస్టర్మైండ్స్ ఎవరు? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..