
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కే సు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చో టుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం నోటీసులు జారీ చేసింది. శుక్రవారం (జనవరి 23) ఉదయం 11 గంటలకు జూ బ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కా వాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. సిఆర్పిసి 160 కింద నందినగర్లోని కెటిఆర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులను అందజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు 2024 మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈ నెల 20వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. హరీష్ రావు విచారణ ముగిసిన రెండు రోజులకే కెటిఆర్కు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
హరీశ్ ఫైర్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వే దికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంత్ నోటీసుల డ్రామా అంటూ ఘాటు విమర్శలు చేశా రు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు అం టూ ఆరోపణలు చేశారు. రేవంత్రెడ్డి బామ్మర్ది బొ గ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.‘రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగమే నిన్న నాకు, నేడు కెటిఆర్కు ఇచ్చిన నోటీసులు’ అని పేర్కొన్నారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం..దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే అని వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారని, తాము ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిటారుగా
నిలబడి సిఎంను నిలదీస్తున్నామని అన్నారు. సిట్ నోటీసులకు సమాధానం చెప్పడానికి బిఆర్ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధమే అని తేల్చిచెప్పారు. కానీ, రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి రేవంత్రెడ్డి సిద్దంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. రేవంత్రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బిఆర్ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా ఆయనను, ఆయన పార్టీని వదిలిపెట్టం అని హెచ్చరించారు. అంతే కాదు, కాంగ్రెస్ సర్కార్ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బిఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారు..జై తెలంగాణ..జై కెసిఆర్ అంటూ ట్వీట్ చేశారు.
ప్రశ్నిస్తున్న పార్టీ లక్ష్యంగానే నోటీసులు : సోమభరత్
ప్రతిపక్షాల నోరు మూయించేందుకే సిట్ ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ విమర్శించారు. కోర్టులు, చట్టంపై నమ్మకం ఉన్నందున చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. హామీలు అమలు చేయకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, ప్రజల దృష్టి మళ్లించేందుకు సిట్ వేశారని ఆరోపించారు. నోటీసు ఇచ్చి .. విచారణకు వచ్చేందుకు కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం తమ పార్టీ సీనియర్నేత హరీష్రావుకు నోటీసులు ఇచ్చి, 7 గంటలకు పైగా విచారణ చేశారని మండిపడ్డారు. కేవలం ప్రశ్నిస్తున్న పార్టీ లక్ష్యంగానే నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ టార్గెట్గా నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చట్టం అమలు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విచారణకు కెటిఆర్తో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరామని, సాక్షిగా విచారణ చేసినప్పుడు న్యాయవాదిని అనుమతించబోమని ఎసిపి చెప్పారని తెలిపారు.
న్యాయస్థానాలు చెప్పినా సీరియల్లా చేస్తున్నారు : నిరంజన్రెడ్డి
కెటిఆర్కు సిట్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ సర్కారు నాటకం ఆడుతుందని మాజీ మంత్రి,బిఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పాలన గాలికి వదిలి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చేస్తున్నారని ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్లగా దర్యాప్తు నడిపిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజల కర్మానికి వదిలేసి దావోస్ అటు నుండి అమెరికా పర్యటన పెట్టుకున్నారని మండిపడ్డారు. సర్కారు సొమ్ముతో రేవంత్ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి విదేశాల్లో విహరిస్తూ అక్కడి నుండి వచ్చే వరకు ఈ సీరియల్ నడిచేలా ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందని ఆరోపించారు.
డైవర్షన్ పాలిటిక్స్కు పరాకాష్ట : వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక, తన అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో సిఎం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రెండు రోజుల క్రితం హరీష్ రావుకు నోటీసులని డ్రామా ఆడి, ఇప్పుడు కెటిఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఇది రేవంత్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందనడానికి నిదర్శనం అని ఘాటు విమర్శలు చేశారు.