
సాధారణంగా బ్యాంకుల్లోకి వెళ్తే ‘క్యాష్ డిపాజిట్’, ‘విత్డ్రా’ ఫారాలు కనిపిస్తాయి. కానీ యాదాద్రి జిల్లా మోత్కూర్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మాత్రం సీన్ రివర్స్ అయింది. అక్కడ ఉద్యోగులు ఒక అడుగు ముందుకు వేసి, బ్యాంకును ఏకంగా ‘లిక్కర్ డిపాజిట్’ సెంటర్గా మార్చేశారు. విధి నిర్వహణలో ఉండాల్సిన క్రమశిక్షణను ‘విత్డ్రా’ చేసి, మద్యం బాటిళ్లతో ‘ఫుల్ ఎంజాయ్’ చేశారు.
పగలు రైతులు, సామాన్యుల లావాదేవీలతో బిజీగా ఉండే ఈ సహకార బ్యాంకు, సాయంత్రం కాగానే ‘సహకార మద్యం సంఘం’గా రూపాంతరం చెందింది. బ్యాంకులో నగదు లెక్కించాల్సిన టేబుళ్లపై మద్యం సీసాలు కొలువుదీరాయి. ఫైళ్లను తిరగేయాల్సిన చేతులు, గ్లాసులను తిరగేస్తూ బిజీగా మారిపోయాయి. తమ స్నేహితులతో కలిసి సిబ్బంది జరిపిన ఈ ‘మద్యం పంపిణీ పథకం’ చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.
Russia: కూలిన రష్యా సైనిక విమానం.. 29 మంది మృతి
బ్యాంకు రికార్డులు, ప్రజల సొమ్ము భద్రంగా ఉండాల్సిన చోట.. ముక్కూ మొహం తెలియని స్నేహితులను పిలిపించుకుని విందు ఆరగించడం చూస్తుంటే, వీరు నిబంధనలను ఎప్పుడో ‘రద్దు’ చేసినట్లు కనిపిస్తోంది. సాధారణ ప్రజలు లోన్ కోసం వస్తే వందల సంతకాలు అడిగే ఈ మేధావులు, తమ పర్సనల్ పార్టీ కోసం బ్యాంకు రూల్స్ మొత్తాన్ని ‘డిఫాల్ట్’ లిస్టులో పడేశారు. ఆ టేబుళ్లపై ఉన్న మద్యం బాటిల్స్, చికెన్ ముక్కలు చూస్తుంటే.. అది బ్యాంకు లావాదేవీల కోసమో లేక ‘బార్ అండ్ రెస్టారెంట్’ ప్రమోషన్ కోసమో అన్న అనుమానం కలగక మానదు.
Harish Shankar – DSP : ఉస్తాద్ వివాదం.. హరీష్ శంకర్ను అన్ ఫాలో చేసిన దేవిశ్రీ ప్రసాద్
బ్యాంకులో మద్యం సేవించడం అనే ‘కొత్త స్కీమ్’ను ప్రవేశపెట్టిన ఈ ఉద్యోగుల తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. “వడ్డీ రేట్లు ఎలా ఉన్నా.. మద్యం రేట్లు మాత్రం వారికి బాగా తెలుసన్నమాట” అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ ‘లిక్కర్ లావాదేవీల’పై ఉన్నతాధికారులు కఠినమైన ‘పెనాల్టీ’ విధిస్తారా? లేక ఈ విషయాన్ని కూడా ‘లోన్ మాఫీ’ లాగా వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.
ఏది ఏమైనా, మోత్కూర్ కో-ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు మాత్రం తమ వినూత్న ‘లిక్కర్ బ్యాంకింగ్’తో జిల్లాలోనే హాట్ టాపిక్ అయ్యారు. సామాన్యుడి సొమ్ముకు కాపలా ఉండాల్సిన వారే ఇలా ‘మత్తు’లో మునిగిపోతే, ఇక ఆ బ్యాంకుకు ‘దివాళా’ తీయడం పెద్ద కష్టమేమీ కాదని జనం మండిపడుతున్నారు.