
Iran: ఇరాన్ యుద్ధం ప్రారంభమైన నెల రోజులు గడిచింది. అయినప్పటికీ, ఇప్పటికీ యుద్ధం తీవ్రస్థాయిలోనే కొనసాగుతోంది. యుద్ధం తర్వాత చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుని నియంత్రిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే అప్పటి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్య చేయబడ్డాడు. ఇక ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంలీడర్గా ఎన్నికయ్యారు. అయితే, ఆయన కూడా యూఎస్-ఇజ్రాయిల్ దాడిలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అతడి ఆచూకీ ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.
ఈ నేపథ్యంలో ఇరాన్ అధికారంలో వర్గపోరు తీవ్రమవుతున్నట్లుగా తెలుస్తోంది. అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నామమాత్రంగా, ఒక కీలుబొమ్మగా మారాడని, అసలు అధికారం చెలాయించేది ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్(IRGC) అని తెలుస్తోంది. అధ్యక్షుడు, ఇరాన్ సైన్యం మధ్య అధికార పోరాటం జరుగుతోంది. మితవాద నాయకుడిగా పేరొందిన పెజెష్కియాన్ మాటకు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు మొత్తం పాలన, యుద్ధం అమలును ఐఆర్జీసీనే పర్యవేక్షిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఐఆర్జీసీదే అధికారం:
నివేదిక ప్రకారం, , ఐఆర్జీసీ సీనియర్ అధికారులతో కూడిన ఒక “సైనిక మండలి” ఇప్పుడు రోజువారీ నిర్ణయాలు తీసుకుంటోంది. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నట్లుగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రాజకీయ శూన్యత నేపథ్యంలో సైన్యమే అధికారం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఐఆర్జీసీ మొజ్తబా చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. దేశ పరిస్థితిపై ప్రభుత్వ నివేదికలు కూడా ఆయనకు చేరకుండా అడ్డుకుంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సుప్రీంలీడర్ను కలిసేందుకు కూడా ఐఆర్జీసీ ఒప్పుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి.
గత వారం ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిదీ ఒత్తిడి కారణంగా, ఇంటెలిజెన్స్ మంత్రిగా హుస్సేన్ దేఘన్ను నియమించాలన్న పెజెష్కియాన్ ప్రయత్నం విఫలమైంది. యుద్ధం ప్రారంభ దశలో మహమ్మద్ పక్పూర్ మరణించిన తర్వాత, వాహిది ఆ శక్తివంతమైన ఐఆర్జీసీకి నాయకత్వం వహించారు. కీలకమైన, సున్నితమైన పదవుల్ని ఈ సైన్యమే ఎంపిక చేస్తోంది. నిజానికి ఇరాన్ పాలనా వ్యవస్థలో సుప్రీంలీడర్ ఆమోదం తర్వాత అధ్యక్షుడు ఈ పదవులను నియమిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
గల్ఫ్లోని ఇతర దేశాలపై ఐఆర్జీసీ చేస్తున్న దాడులపై అధ్యక్షుడు పెజెష్కియాన్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ఒత్తిడి చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1979 విప్లవం తర్వాత ఒక పారామిలిటరీ దళంగా ప్రారంభమైన ఐఆర్జీసీ, చాలా కాలంగా అధికారాన్ని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తోంది.
సుప్రీంలీడర్ వర్గంలో కూడా కలవరం:
సుప్రీంలీడర్ వర్గాన్ని కూడా ఐఆర్జీసీనే కంట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొజ్తబా అంతరంగిక వర్గంలో ఇటీవల ఉద్రిక్తతలు చెలరేగాయి. శక్తివంతమైన సీనియర్ భద్రతా అధికారి అయిన అలీ అస్గర్ హెజాజీని సుప్రీం లీడర్ టీమ్ నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖమేనీ వారతస్వాన్ని వ్యతిరేకించడంతో ఆయనను టార్గెట్ చేస్తున్నారు. మొజ్తబాకు ఆయతొల్లా అయ్యే అర్హత లేదని ఈయన ఆరోపిస్తున్నాడు. ఆయనకు ఉన్నత పదవి అప్పగిస్తే ఇరాన్ పూర్తిగా ఐఆర్జీసీకి చేతుల్లోకి వెళ్లడమే అని హెజాజీ హెచ్చరించారు.