Reading Time: < 1 minute
Commercial Lpg Cylinder Price Hike India 19kg Gas Rate Increase Delhi April

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే.. ప్రభావం మాత్రం అన్ని దేశాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఆయా దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభం తీవ్రమవుతోంది. ఇప్పటికే భారతదేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై ఆంక్షలు ఉన్నాయి. పైగా గత నెలలో ఒకసారి ధర పెరిగినప్పటికీ గ్యాస్ దొరకడం లేదు. తాజాగా మరోసారి కేంద్రం షాకిచ్చింది. లేటెస్ట్‌గా 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.195.50కు పెంచింది. దీంతో కొత్త ధరతో వాణిజ్య సిలిండర్ రూ.2,000లకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ధర రూ.2,078.50కు చేరింది. ఇక గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది. గృహ వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం కాగానే మార్చి 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.114.50కు పెంచింది. మళ్లీ నెలరోజులు తిరిగి రాగానే రూ.195.50 పెంచింది. ఇక మార్చి 7న 14.2 కేజీల గృహ ఎల్‌పీజీ ధరలను రూ.60 పెంచారు. అప్పటి నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన అంతర్జాతీయ ప్రమాణాలు, మారకపు రేట్ల ఆధారంగా ఎల్‌పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను సమీక్షిస్తాయి. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు ఊరటనిచ్చి.. వాణిజ్యానికి షాకిచ్చారు.

వాహనదారులకు ఊరట
ఇదిలా ఉండగా యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నాయి. గతేడాది మార్చిలో లీటరుకు రూ.2 ధర తగ్గించినప్పటి నుంచి ఈ ధరల్లో మార్పు కనిపించలేదు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.72, డీజిల్ లీటరుకు రూ.87.62 చొప్పున అమ్ముడవుతోంది.