
హైదరాబాద్ నగరంలోని కార్వాన్ పరిధిలోని మహబూబ్ కాలనీలో ద్విచక్ర వాహనాల దొంగతనం ఘటన స్థానికంగా కలకలం రేపింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను టార్గెట్గా ఎంచుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు పరిసరాలను గమనిస్తూ రెక్కీ నిర్వహించిన అనంతరం, ఎవరూ లేని సమయాన్ని ఎంచుకుని దొంగతనానికి పాల్పడ్డారు. తమ ప్లాన్ ప్రకారం ట్రాలీ ఆటోను అక్కడికి తీసుకొచ్చిన నిందితులు, వాహనాలకు అడ్డుగా ఉంచి అనుమానం రాకుండా చేశారు. అనంతరం వాహనాల తాళాలు విరగొట్టి, అవి ట్రాలీలో ఎక్కించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దొంగతనం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. చోరీకి గురైన వాహనాల్లో అవెంజర్ బైక్, యాక్టివా స్కూటర్ ఉన్నట్లు తెలుస్తోంది. దొంగలు అఖరా స్కూల్ మార్గంగా ఆసిఫ్ నగర్ రోడ్ వైపు వెళ్లినట్లు ఫుటేజ్లో కనిపిస్తోంది.
సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన వాహన యజమాని మక్బూల్ అల్ హాజ్రీ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఆధారంగా నిందితుల గుర్తింపు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.