
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వారం రోజుల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో కెటిఆర్ ప్రసంగించనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వ్యూహాలపై ఆయన తన అనుభవాలను పంచుకోనున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా గతంలో కెటిఆర్ సాధించిన విజయాలు,
రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన తీరును దృష్టిలో ఉంచుకుని ఈ ఆహ్వానం అందింది. వ్యాపార సదస్సుతో పాటు, ఈ పర్యటనలో కెటిఆర్ తన కుమారుడు హిమాన్షును కూడా కలవనున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, కొంత సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడపనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుమారు వారం రోజుల పాటు అమెరికాలో ఉండనున్న కెటిఆర్, తిరిగి వచ్చాక తన రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు.