
టెక్ దిగ్గజం ఒరాకిల్ అన్నంత పని చేసింది. 30 వేల మందిని కంపెనీ నుంచి సాగనంపుతామని ప్రకటించి.. వారం రోజులు గడవక ముందే లేఆఫ్స్ ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్ ఈమెయిల్స్ తో గుడ్ మార్నింగ్ చెబుతోంది. ఇండియాతో సహా చాలా దేశాలలోని ఉద్యోగులకు ఉధ్వాసన పలుకుతోంది. లేఆఫ్ మెయిల్స్ వచ్చినట్లు ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఒరాకిల్ లీడర్షిప్ అనే మెయిల్ నుంచి ఉద్యోగులకు మెయిల్స్ వచ్చాయి. .. సంస్థాగత మార్పులలో భాగంగా మీ రోల్స్ ను తొలగిస్తున్నట్లు మెయిల్ పంపించింది. ఇదే మీకు చివరి పని రోజు అనే మెసేజ్ చూసి ఎంప్లాయిస్ షాకింగ్ కు గురవుతున్నారు. ముందస్తు సమాచారం లేదు.. HR నుంచి ఫోన్ లేదు.. మేనేజర్ నుంచి మెసేజ్ లేదు.. డైరెక్ట్ ఈమెయిల్ వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. రెడిట్, Blind లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో లేఆఫ్స్ కు సంబంధించిన పోస్టులు చేస్తున్నారు.
ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. RHS (రెవెన్యూ అండ్ హెల్త్ సైన్సెస్), SVOS (సాస్ అండ్ వర్చువల్ ఆపరేషన్స్ సర్వీసెస్) వంటి టీమ్స్ లలో కనీసం 30% ఉద్యోగుల కోత విధించినట్లు చెప్పారు. ఒక్కో వ్యాపార విభాగం నుండి 16 లేదా అంతకంటే ఎక్కువ మంది ఇంజనీర్లను ఒకేసారి తొలగించారు. ఈ కోతలలో కనీసం ఒక మేనేజర్ కూడా ఉన్నారు. నెట్సూట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (IDC) కూడా దెబ్బతింది, ఇక్కడ పలు స్థాయిలలోని PM, IC, మేనేజర్ పాత్రలలో కోతలు విధించబడ్డాయి.
ఉద్యోగం కోల్పోయిన వారికి పరిహారం ఇస్తామని కంపెనీ మెయిల్ లో పేర్కొంది. కానీ అది కూడా రిజిగ్నేషన్ డాక్యుమెంట్స్ పై సంతకం చేసిన తర్వాత మాత్రమేనని చెప్పింది. ఉద్యోగ విరమణ ఇమెయిల్లో, DocuSign ద్వారా పంపిన ఉద్యోగ విరమణ పత్రాలపై సంతకం చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగులు సెవరెన్స్ ప్యాకేజీకి అర్హులవుతారని తెలిపింది. తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs), ఉద్యోగ విరమణ వివరాలతో సహా తదుపరి సమాచారాన్ని స్వీకరించడానికి, ఉద్యోగులను వారి వ్యక్తిగత ఇమెయిల్ లను అప్డేట్ చేసుకోవాలని కూడా కోరారు.
ఇండియన్ ఎప్లాయిస్ కు N+2 ఫార్ములాను ఆధారంగా పరిహారం అందుతుందని భావిస్తున్నారు. ఇక్కడ N అనేది పనిచేసిన సంవత్సరాల సంఖ్య, 2 అంటే రెండు నెలలు. అయితే, ఇంకా కేటాయించని ఏవైనా RSUలు రద్దు అవనున్నాయి.
సబ్రెడిట్లోని పోస్ట్ల ప్రకారం, ప్రభావిత ఉద్యోగులు ఫిడిలిటీ ద్వారా తమకు కేటాయించిన స్టాక్ను పొందగలుగుతారు, కానీ ప్రొడక్షన్ సిస్టమ్స్ యాక్సెస్ దాదాపు వెంటనే రద్దు చేయబడింది. కొంతమంది ఉద్యోగులు ఏప్రిల్ 3ని తమ చివరి పనిదినంగా పేర్కొన్నారు.
బ్లైండ్లోని పోస్టుల ప్రకారం, ఒరాకిల్ ఇటీవల ఉద్యోగులకు ఇచ్చిన అన్ని మ్యాక్ ల్యాప్టాప్లలో ఒక ట్రాకింగ్ యుటిలిటీని ఇన్స్టాల్ చేసిందని, అది అన్ని యాక్టివిటీస్ లను రికార్డు చేస్తోందని కూడా తెలుస్తోంది. ఉద్యోగులు తమ ల్యాప్ టాప్ తిరిగి ఇచ్చే ముందు ఎలాంటి కోడ్ లేదా డేటాను కాపీ చేయవద్దని ఆ పోస్ట్ హెచ్చరించింది.
ఈమెయిల్ లో పూర్తిగా ఏముంది..?
మీ ఉద్యోగానికి సంబంధించి ఒక బాధాకరమైన వార్తను తెలియజేస్తున్నాము. ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను పరిశీలించిన తరువాత, సంస్థాగత మార్పులో భాగంగా మీ రోల్ పై నిర్ణయం తీసుకున్నాము. ఈరోజే మీ చివరి పనిదినం అని చెప్పడానికి చింతిస్తున్నాము. మాతో ఉన్న సమయంలో మీరు చూపిన అంకితభావానికి, కఠోర శ్రమకు, మేము ధన్యవాదాలు. మీ రిజైన్ లెటర్స్ పై సంతకం చేసిన తరువాత, సెవరెన్స్ ప్లాన్ నిబంధనలు , షరతులకు లోబడి మీకుసెవరెన్స్ ప్యాకేజీ అందిస్తాము. మీ సెవరెన్స్ తొలగింపు తేదీ వివరాలతో కూడిన ఇమెయిల్ను డాక్యుసైన్ నుంచి మీ ఒరాకిల్ ఇమెయిల్ కు పంపిస్తాము.