
కొత్త ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి రోజే భారతీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో అదిరిపోయే బోణీ కొట్టాయి. గత కొన్ని రోజులుగా యుద్ధ మేఘాల మధ్య నష్టాల్లో కూరుకుపోయిన మార్కెట్లు, బుధవారం ఒక్కసారిగా ‘బుల్లిష్’ ట్రెండ్లోకి మారాయి. ప్రధానంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు (1.65%) పెరిగి 73,134.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 348 పాయింట్లు (1.56%) లాభంతో 22,679.40 వద్ద స్థిరపడింది. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 2,000 పాయింట్ల వరకు పెరగడం మార్కెట్ జోరుకు నిదర్శనం. దీనివల్ల బిఎస్ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 13 లక్షల కోట్లు పెరిగింది.
Also Read: PF Interest Hike: ఈపీఎఫ్ఓ వడ్డీ 10 శాతానికి పెంపు..? మంత్రి ఏమన్నారంటే..
మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. ఇరాన్తో యుద్ధాన్ని రెండు మూడు వారాల్లోనే ముగిస్తామని ఆయన ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడింది. యుద్ధం ముగిస్తే చమురు సరఫరా మెరుగుపడుతుందనే ఆశలు రేకెత్తాయి. యుద్ధం ఆగిపోతుందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 101-103 డాలర్లకు పడిపోయింది. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం వంటి దేశాలకు ఇది పెద్ద ఊరట.
Also Read:Contract Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త..
గత మార్చి నెలలో భారత మార్కెట్లు దాదాపు 11 శాతం మేర నష్టపోయాయి. ఆరేళ్లలో ఒక నెలలో ఈ స్థాయి నష్టాలు రావడం ఇదే మొదటిసారి. షేర్ల ధరలు భారీగా తగ్గడంతో.. తక్కువ ధరకే నాణ్యమైన షేర్లు లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. మార్కెట్ పెరుగుదలలో బ్యాంకింగ్, ఏవియేషన్, డిఫెన్స్ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి.
ఇండిగో (InterGlobe Aviation)కొత్త సీఈవోగా విల్లీ వాల్ష్ నియామకంతో ఈ షేరు 6.7% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 2.3% లాభపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మార్కెట్ను నడిపించాయి. గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ (16%), కొచ్చిన్ షిప్యార్డ్ (12%) భారీగా లాభపడ్డాయి. ఎల్ అండ్ టీ (3.4%), ట్రెంట్ (7%), అవెన్యూ సూపర్ మార్ట్స్ (డిమార్ట్) షేర్లు రాణించాయి.
డాలర్తో రూపాయి మారకం విలువ 94.70 వద్ద కొనసాగుతోంది. మార్కెట్లో భయాన్ని సూచించే వోలటాలిటీ ఇండెక్స్ (VIX) 10 శాతం తగ్గింది. దీని వల్ల మార్కెట్లు దూసుకుపోయాయి. యుద్ధ భయాలు తొలగిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల మద్దతు , కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అయితే.. నిఫ్టీ స్థిరంగా 24,000 మార్కును దాటితేనే ఈ బుల్లిష్ ట్రెండ్ దీర్ఘకాలం కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.