వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీల ఏర్పాటుతో పాటు తాగునీరు, లడ్డు ప్రసాదం, తలంబ్రాలు మరియు ముత్యాలను పంపిణీ చేసేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ అద్భుత వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు కడప జిల్లాకు చేరుకోనున్న సీఎం, రాత్రి 7 గంటలకు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సీతారాముల వారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజే కల్యాణ వేడుకలు జరిగితే, ఒక్క ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత వచ్చే పౌర్ణమి నాడే ఈ వేడుకను నిర్వహిస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ చరిత్ర ఉంది. చంద్రుడి కోరిక మేరకు, దేవతలందరూ కలిసి నిండు పౌర్ణమి రోజున చంద్రుడు చూస్తుండగా ఈ కల్యాణాన్ని జరిపిస్తారని భక్తుల నమ్మకం. అందుకే వెన్నెల వెలుగుల్లో స్వామి వారి కల్యాణాన్ని ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం మొత్తం 18 ప్రదేశాలను కేటాయించగా, వీఐపీ వాహనాల కోసం ప్రత్యేకంగా 5 చోట్ల పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. భక్తుల భద్రత కోసం వేల సంఖ్యలో పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి, 6వ తేదీన ధ్వజావరోహణంతో ఈ వేడుకలు ముగియనున్నాయి.
కల్యాణోత్సవం సందర్భంగా కడప-తిరుపతి ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలకు పోలీసులు దారి మళ్లింపు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి వైపు వెళ్లే వాహనాలను ఊటుకూరు మరియు రాయచోటి మీదుగా మళ్లించనున్నారు. అలాగే కడప వైపు వచ్చే వాహనాలను చాలా బాధ క్రాస్ రోడ్ వద్ద నుంచి దారి మళ్లించారు. వాహనదారులు ఈ మార్పులను గమనించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు
-సుధీర్ చప్పిడి,
కడప.




