
పార్లమెంట్ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాబోతోంది. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ద్వారా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం.. లోక్సభలో కేంద్రహోంశాఖ బిల్లు ప్రవేశపెట్టనుంది. దీంతో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై పార్లమెంట్లో చర్చ జరగనుంది. ఆ చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రైతుల పోరాటం, ప్రజలు పడ్డ ఇబ్బందులు, గత ప్రభుత్వం చేసిన విషయాలను పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై టీడీపీ తరపున కేంద్రమంత్రి చంద్రశేఖర్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడనున్నారు. బీజేపీ నుంచి పురంధేశ్వరి.. జనసేన నుంచి బాలశౌరి చర్చలో పాల్గొంటారు. ఇక.. వైసీపీ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగిస్తారు.