Reading Time: 2 minutes
Cm Chandrababu Naidu Teleconference With Tdp Leaders Key Directions And Ap Development Plans

CM Chandrababu: తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, గ్రామస్థాయి కార్యకర్తలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం వంటి పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 29న ఘనంగా నిర్వహించామని, పార్టీకి సేవలందించిన సీనియర్ కార్యకర్తలను సత్కరించామని తెలిపారు. రాజకీయ సాధికారతను పెంపొందిస్తూ, జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు పదవులు కేటాయించి సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తాను ప్రతి పర్యటనలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మార్గదర్శకత్వం అందిస్తున్నానని చెప్పారు.

Read Also: AP Panchayat Raj Wins National Awards 2026: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు జాతీయ అవార్డులు.. పవన్‌ కల్యాణ్‌ హర్షం..

ప్రతి నెల మొదటి తేదీన “పేదల సేవలో” కార్యక్రమం ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు చంద్రబాబు. అమరావతిని రాజధానిగా కేంద్రం చట్టబద్ధం చేయనున్న నేపథ్యంలో, ఈ విషయాన్ని గర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గత పాలకులు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేశారని విమర్శించారు. రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయని, అమరావతి నిర్మాణం రైతులు ఇచ్చిన భూములతోనే జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని నాయకులకు సూచించారు.

ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతూ, పీ4 పథకం కింద 10 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని, ఏడాదిలోనే 2 లక్షల కుటుంబాల్లో మార్పు తీసుకురాగలిగామని తెలిపారు చంద్రబాబు… ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, బకాయిలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించామని, 22 నెలల్లో 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. టిడ్కో ఇళ్ల కోసం అడ్వాన్స్ చెల్లించిన వారికి రూ.174 కోట్లను తిరిగి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.

రాయలసీమ అభివృద్ధి, నీటి ప్రాజెక్టులపై కూడా వివరించారు చంద్రబాబు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందిస్తున్నామని, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధికి పూర్వోదయ పథకం దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల పట్ల ప్రజాప్రతినిధులు సత్ప్రవర్తనతో ఉండాలని, వారిని ఆప్యాయంగా కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. అలాగే నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, నీతిమాలిన చర్యలకు పాల్పడేవారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రతి స్థాయిలో ఖండించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..