
UK: గత నెల రోజులుగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటో దేశాలు అమెరికాకు సహకరించకపోయినా, గల్ఫ్ లోని మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా ఈ యుద్ధంలో చేరే అవకాశం కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఎగుమతులు, ఆహారం దిగుమతులకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ కేంద్రంగా యుద్ధం మారుతోంది. హార్ముజ్ను తెరిపించేందుకు, ఇరాన్ నియంత్రణ లేకుండా చేసేందుకు అమెరికా దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Diesel & Petrol Price: పెట్రోల్ & డీజిల్ ధరల పెరుగుదలపై.. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన
ఇదిలా ఉంటే, తాజాగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్కు భారీ షాక్ ఇచ్చారు. తాము యుద్ధంలో పాల్గొనేది లేదని, తమకు యుద్ధంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనికి బదులుగా హార్ముజ్ జలసంధిని తెరవడానికి ‘‘హార్ముజ్ సమ్మిట్’’కు ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. ఈ వివాదం పరిష్కారం అయ్యేలా మధ్యవర్తిత్వం చేస్తామని వెల్లడించారు. సుమారు 35 దేశాలతో ఒక సమావేశం జరుగుతుందని స్టార్మర్ చెప్పారు.
ఇప్పటికే.. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటో కూటమి దేశాలు సాయం చేయడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా బ్రిటన్ను టార్గెట్ చేస్తూ, దమ్ముంటే హార్ముజ్ వద్దకు వెళ్లి చమురు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఇదే కాకుండా, నాటో నుంచి బయటకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు ట్రంప్ బాంబ్ పేల్చారు.