Reading Time: 2 minutes
Nizamabad Double Murder Shocker Daughter In Law Kills Mother In Law For Gold Mechanic Murdered In Nizamabad City

NZB MURDERS: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకే రోజు రెండు హత్యలు కలకలం రేపాయి. అత్త బంగారు నగలపై కన్నేసిన ఓ కోడలు.. వాటి కోసం అత్తను కడతేర్చింది. అంతే కాదు సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. సీన్ కట్ చేస్తే స్థానికులు గుర్తు పట్టడంతో అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. మరోవైపు తన చెల్లితో మాట్లాడుతున్నాడని ఆగ్రహించిన ఓ అన్న.. తాను పని చేసే ఓనర్‌‌ను హత్య చేశాడు. ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు హత్యలు జిల్లా వాసులను ఉలిక్కిపడేలా చేశాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో రుక్మవ్వ అనే వృద్దురాలు మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అంతా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ క్రమంలో రుక్మవ్వ.. ఆరోగ్యంగానే ఉండేది.. కానీ ఇలా ఎలా జరిగిందని చాలా మంది చర్చించుకున్నారు. ఓ వైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో గ్రామస్తులకు రుక్మవ్వ తలపై బలమైన గాయం కనిపించింది. దీంతో అనుమానించారు.

తలపై ఉన్న బలమైన గాయం చూస్తే.. సహజ మరణంగా కనిపించడం లేదనే విషయం అర్థమైంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కావటి రుక్మవ్వకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కుమారులు మరణించగా చిన్న కుమారుడు భార్యా పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రుక్మవ్వ, ఇద్దరు కోడళ్లు సీతాయిపల్లి గ్రామంలోనే వేర్వేరుగా ఉంటున్నారు. ఐతే పోలీసులు వచ్చే వరకు రుక్మవ్వ రెండో కోడలు కోటవ్వ.. తన అత్తది సహజ మరణమేనని నమ్మించింది. సీన్ కట్ చేస్తే.. పోలీసులు ఎంటరైన తర్వాత అసలు విషయం బయటపడింది.

రెండో కోడలు కోటవ్వ, అత్త మధ్య కొంత కాలంగా గొడవలు జరగుతున్నాయి. అత్త దగ్గర ఉన్న బంగారు నగలు ఎలాగైనా కాజేయాలని పథకం వేసిన కోడలు.. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న రుక్మవ్వ ఇంట్లో చొరబడింది. బండరాయితో అత్త తలపై బాది హత్య చేసింది. అనంతరం రుక్మవ్వ మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవి కమ్మలు తీసుకొని వెళ్లిపోయింది. రుక్మవ్వ మృతి చెందటంతో.. గ్రామస్థులు బంధువులు మృతురాలి ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో కోడలు కోటవ్వ కూడా ఏమీ తెలియనట్లు వ్యవహరించింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. బంగారం కోసం హత్య చేశానని ఆమె అంగీకరించింది. దీంతో కోటవ్వను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కాజేసిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్‌లో మరో హత్య

మరోవైపు నిజామాబాద్‌లో మరో హత్య జరిగింది. 6వ టౌన్ పరిధిలోని అక్బర్ బాగ్‌లో లారీ మెకానిక్‌గా పనిచేసే అక్షయ్‌ను అతని వద్ద పని చేసే కార్మికుడు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. అక్షయ్ ఇంట్లో చొరబడి.. గొడ్డలితో పలుమార్లు నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అక్బర్ బాగ్‌లో నివాసం ఉండే.. అక్షయ్ లారీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇంటి ఎదురుగా ఉండే వ్యక్తి అక్షయ్ వద్ద పని నేర్చుకుంటున్నాడు. అయితే కొద్ది రోజులుగా అక్షయ్ తన చెల్లి తో మాట్లాడుతున్నాడని సదరు యువకుడు కక్ష పెంచుకున్నాడు. మొన్న రాత్రి కూడా చార్జర్ కావాలంటూ ఆ యువతితో అక్షయ్ మాటామాటా కలిపాడు. ఆగ్రహంతో ఉన్న నిందితుడు.. రాత్రి అక్షయ్ ఇంట్లో చొరబడి.. గొడ్డలితో నరికి.. కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.