
- వాడీవేడిగా తొలి జనరల్బాడీ మీటింగ్
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ నగరపాలక సంస్థ మొదటి సర్వసభ్య సమావేశం మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం వాడీవేడీగా సాగింది. సమావేశంలో కలెక్టర్ చిత్రామిశ్రా, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. టేబుల్ ఎజెండాతో పాటు ఎజెండాలోని 37 అంశాలను ఆమోదించారు. 2026–27కు గానూ రూ.312.46 కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించింది. కాగా పలువురు అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య పలు అంశాలపై వాగ్వాదం జరిగింది. సిటీలో నెలకొన్న కుక్కల, కోతుల బెడదను అరికట్టాలని, డంపింగ్ యార్డు, అక్రమ నిర్మాణాల సమస్యల్ని పరిష్కరించాలని 26వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మున్సిపల్ ఆఫీస్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన చేస్తూ కౌన్సిల్ హాల్ లోకి వచ్చారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు వరదలా తీసుకొస్తానన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హామీ ఏమైందని ప్రశ్నించారు. 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు మాట్లాడుతూ మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, మానేరు వాగులోంచే రాళ్లను, మట్టిని తవ్వి అక్కడే వినియోగించి రూ. కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాగా డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ కార్పొరేటర్ రవీందర్సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది.
ట్యాక్స్ ఎగవేతలపై కార్పొరేటర్ల ఆగ్రహం..
మార్చి27న ‘రూ.లక్షల్లో కిరాయిలు వస్తున్నా…ట్యాక్స్ ఎగ్గొడుతున్నరు’ అనే హెడ్డింగ్ తో ‘వెలుగు’ పేపర్ లో పబ్లిష్ అయిన స్టోరీ ఆధారంగా పలువురు కార్పొరేటర్లు బకాయిలపై అధికారులను ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్లు చాడగొండ కవిత, సరిళ్ల రాజకుమారి, దేశశిల్ప, ప్రవీణ్ రావు, ఆకుల నందిని, ఆకుల నర్మద, తదితరులు పాల్గొన్నారు.