
మన తెలంగాణ/హైదరాబాద్: ‘శ్రీశైలంలో నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్తు ఉత్పత్తి చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మా హెచ్చరికతోనే విరమించుకుంది..’ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్లో కనిష్ఠ నీటి మట్టం స్థాయి 834 అడుగుల (254.2 మీటర్లు)కు చేరుకున్నప్పుడు శ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. మన రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాలు పట్టించుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా నీటిని వినియోగించుకుంటున్నదని మంత్రి జూపల్లి విమర్శించారు. ఈ అంశంపై ఎన్ని సార్లు ఆ రాష్ట్రానికి విన్నవించినా ఏపీ సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. అందుకే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు,
రైతులు అదే విధంగా కృష్ణా పరివాహక ప్రాంత జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చామని వారు చెప్పారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసిందని వారు తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వారు వివరించారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ – ప్రజాప్రతినిధులంతా దేనికైనా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. పాలమూరు జిల్లాకు నష్టం జరిగితే- రైతు పక్షాన ప్రభుత్వం పోరాడుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని మంత్రి జూపల్లి అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇలాగే వ్యవహరిస్తే ఆందోళన చేపటామని, హై కోర్టునాశ్రయించామని ఆయన గుర్తు చేశారు. అప్పుడు, ఇప్పుడ, ఎప్పుడైనా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు