Reading Time: < 1 minute
Ap Weather Alert Severe Heatwave In North Andhra Temperatures Soar Across Rayalaseema

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కొన్ని మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమ జిల్లాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉత్తరాంధ్రలోని కొన్ని మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస, బూర్జ మండలాలు, విజయనగరం జిల్లాలో సంతకవిటి, పార్వతీపురం మన్యం జిల్లాలో గరుగుబిల్లి, పాలకొండ, సీతానగరం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకే వీధి, పోలవరం జిల్లాలో గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వడగాల్పులు కూడా నమోదవుతాయి. విజయనగరం జిల్లాలో 9 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 4 మండలాలు, పోలవరం జిల్లాలో 2 మండలాలు, ఏలూరు-ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కో మండలంలో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. కడప జిల్లా పొట్టిపాడు వద్ద 40.7 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా లద్దగిరిలో 39.9 డిగ్రీల సెల్సియస్, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 39.9 డిగ్రీల సెల్సియస్నమోదయ్యాయి. విజయనగరం జిల్లా నెలివాడలో 39.6 డిగ్రీల సెల్సియస్, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 39.5 డిగ్రీల సెల్సియస్, కృష్ణా జిల్లా నందివాడలో 39.3 డిగ్రీల సెల్సియస్, అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు తాగాలని, వడదెబ్బ నుంచి రక్షణ చర్యలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత అవసరం ఉందని అధికారులు హెచ్చరించారు.