
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయింది. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ముఠాను డీఆర్ఐ , కస్టమ్స్ అధికారులు కలిసి ఆపరేషన్లో చాకచక్యంగా పట్టుకున్నారు.
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో అధికారులు వారిని తనిఖీ చేశారు. వారు తీసుకొచ్చిన బ్యాగేజీని క్షుణ్ణంగా పరిశీలించగా.. లోపల రహస్యంగా దాచిన ప్యాకెట్లలో గ్రీన్ లంపీ సబ్స్టెన్స్ బయటపడింది. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అధికారులు, అది అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ వీడ్ (గంజాయి) అని నిర్ధారించారు.
ఈ సోదాల్లో మొత్తం 25.45 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ. 8.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఎయిర్పోర్ట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను NDPS చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారు? వీటిని ఎక్కడికి సరఫరా చేయాలని ప్లాన్ చేశారు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.