Reading Time: 2 minutes
April 1 2026 Rule Changes Atm Pan Lpg Fastag 8 Key Financial Updates

Rules Change: ఎన్నో కష్ట నష్టాలను, పండుగలను చూపించిన మార్చి ముగిసింది.. దాంతో పాటు ఆర్థిక సంవత్సరం కూడా ముగిసింది.. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ప్రజల దినచర్య, ఖర్చులు, ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, పన్నులు, గ్యాస్ ధరలు, రైల్వే నియమాలు వంటి రంగాల్లో వచ్చిన ఈ మార్పులు ప్రతి కుటుంబ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన ప్రధాన మార్పులు ఏమిటో ఒకసారి చూద్దాం.

1. ATM నిబంధనలలో మార్పులు: మొదటగా ATM లావాదేవీల విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై UPI ద్వారా ATM నుంచి నగదు ఉపసంహరణ కూడా ఉచిత లావాదేవీల పరిమితిలోనే లెక్కించబడుతుంది. మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో 3 నుంచి 5 వరకు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.23 వరకు ఛార్జీ వసూలు చేస్తారు. కొన్ని బ్యాంకులు రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని కూడా తగ్గించాయి.

2. కొత్త ఆదాయపు పన్ను చట్టం: పన్నుల వ్యవస్థలో కూడా పెద్ద మార్పు చోటుచేసుకుంది. 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చింది. పన్నుల సరళీకరణకు ఈ చట్టం దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. జీతాల నిర్మాణం, అలవెన్సులు, పన్ను ప్రణాళికలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

3. స్టాక్ మార్కెట్‌లో అధిక పన్నులు: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారికి కూడా ఇది ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెరిగింది. దీని వల్ల ట్రేడర్లకు అదనపు భారం పడనుంది.

4. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర పెంపు: హైవే ప్రయాణికులకు కూడా ఫాస్టాగ్ ధరలు పెరిగాయి. వార్షిక పాస్ ధర రూ.3,000 నుంచి రూ.3,075కి పెరిగింది. ఇది తరచుగా ప్రయాణించే వారికి కొంత భారం అవుతుంది.

5. కొత్త కార్మిక చట్టం: కొత్త కార్మిక చట్టం అమల్లోకి రావడంతో ఉద్యోగుల జీతాలపై ప్రభావం ఉండనుంది. బేసిక్ సాలరీ కనీసం 50 శాతం ఉండాలని నిబంధన రావడంతో PF కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దీని వల్ల చేతికి వచ్చే జీతం కొంత తగ్గే అవకాశం ఉంది.

6. పాన్ కార్డుకు సంబంధించిన మార్పులు: పాన్ కార్డ్‌కు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు వచ్చాయి. పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇకపై ఆధార్‌తో పాటు ఇతర పత్రాలు అవసరం అవుతాయి. పెద్ద మొత్తంలో లావాదేవీలు, ఆస్తి కొనుగోలు, వాహనాలు కొనుగోలు వంటి సందర్భాల్లో పాన్ చూపించడం తప్పనిసరి అయింది.

7. ఎల్పీజీ ధరలు: గ్యాస్ ధరల్లో మార్పులు ఇప్పటికే కనిపించాయి.. కమర్షియల్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది.. 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.195.50కి పెంచారు.. కోల్‌కతాలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.218 పెంపు జరిగింది.. అయితే, డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు..

8. రైల్వే టిక్కెట్ రద్దు నియమాలు: రైల్వే టికెట్ రద్దు నియమాల్లో కూడా మార్పులు అమల్లోకి వచ్చాయి. ప్రయాణానికి 72 గంటల ముందే రద్దు చేస్తే ఎక్కువ రీఫండ్ లభిస్తుండగా, సమయం దగ్గరపడే కొద్దీ రీఫండ్ తగ్గుతుంది. చివరి 8 గంటల్లో రద్దు చేస్తే ఎటువంటి రీఫండ్ ఉండదు. మొత్తానికి, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులు ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపనున్నాయి. కాబట్టి ఈ కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని, మీ ఖర్చులను సమర్థంగా ప్లాన్ చేసుకోవడం ఎంతో అవసరం.