
- ఈ సమావేశాలు నిరాశ కలిగించాయి: జాజుల
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్, ఫీజు రీయింబర్స్మెంట్, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగకపోవడం బాధాకరమని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే బీసీల ఊసే లేకపోవడం అన్యాయమని, ఈ సమావేశాలు బీసీలకు తీవ్ర నిరాశ కలిగించాయన్నారు. మంగళవారం బీసీ జేఏసీ ఆఫీస్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా ఫూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని, ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించారని జాజుల గుర్తుచేశారు.
పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని, బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక బీసీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సబ్ ప్లాన్ మీద కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నేతలు గణేశ్ చారి, శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.