
హైదరాబాద్, వెలుగు: భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ నెక్స్ట్రా డేటా లిమిటెడ్లో ఆల్ఫా వేవ్ గ్లోబల్, కార్లైల్, యాంకోరేజ్ క్యాపిటల్ సంస్థలు బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,400 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి. దీంతో నెక్స్ట్రా విలువ 3.1 బిలియన్ డాలర్లకు చేరుతుంది. డేటా సెంటర్ నెట్వర్క్ విస్తరణకు, ఏఐ ఆధారిత వృద్ధికి ఈ నిధులను వినియోగిస్తారు.
ప్రస్తుతం 300 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నెక్స్ట్రాను రాబోయే కొద్ది ఏళ్లలో గిగావాట్ స్థాయికి చేర్చాలని ఎయిర్టెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎయిర్టెల్ కూడా తన వంతు పెట్టుబడి పెడుతుంది. దేశంలో క్లౌడ్ సేవలు, ఏఐ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో 25 శాతం మార్కెట్ వాటాను సాధించాలని సంస్థ భావిస్తోంది.