
కొండ నాలికకు మందు వేస్తే…ఉన్న నాలిక ఊడినట్టయ్యిందని టీడీపీ భావిస్తోందా ? ఎక్కడి నుంచో తీసుకొచ్చి…ఇక్కడ ఎంపీగా అవకాశం ఇస్తే…పార్టీని కంపు కంపు చేసేశాడా ? ఆయనతోపాటు మనము పాతుకుపోదాం అనుకున్న నేతల పునాదులు కదిలినట్టు భావిస్తున్నారా ? అటు పార్టీకి…ఇటు వ్యక్తిగతంగా జరిగిన డ్యామేజ్ను కవర్ చేసేందుకు అనుచరులు ప్రయత్నిస్తున్నారా ? ఇంతకీ ఎవరా నేత ?
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పరిస్థితి…ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైందని పార్టీ నేతలు భావిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మహేశ్కు… డ్యామేజ్ కవర్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారట అనుచరగణం. ఎంపీగా గెలిపిస్తే….హైదరాబాద్లో సొంత పెత్తనాలు చేస్తూ డ్రగ్స్ కేసులో ఇరుకున్నారు. ఈ వ్యవహారం అటు టీడీపీ…ఇటు వ్యక్తిగతంగా ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసిందని కూటమి నేతలు భావిస్తున్నారట. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఇక్కడే పాతుకుపోదామని పుట్టా ఫిక్సయ్యారు. అయితే ఇంతలోనే డ్రగ్స్ ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో జరిగిన డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకు పార్లమెంటు పరిధిలో అడుగడుగునా ఎంపీ పుట్టా మహేష్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది. ఏడు నియోజకవర్గాల్లోనే ఆయన అనుచరగణం…అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ అడుగడుగునా ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏలూరు ప్రగతి రథసారథి, ఏలూరు జిల్లానే ఆయన కుటుంబం, 1000 కోట్లతో 12 రైల్వే బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్న రికార్డుల రారాజు అంటూ పార్లమెంట్ పరిధి వెలుస్తున్నాయి. వీటిపై నియోజకవర్గంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయట. ఇంకా ఇలాంటి వాళ్లను వెనకేసుకొస్తారా అంటూ ప్రత్యర్థులు నెగిటివ్ పబ్లిసిటీకి వాడుకుంటున్నారట.
జరిగిన డ్యామేజీను కవర్ చేసుకునే ప్రయత్నాల్లో అనుచరగణం ఉంటే… పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అనుమానాలు పుట్టా మహేశ్తో పాటు అనుచరులను వెంటాడుతున్నాయట. దీంతో ఆయన ఊసు ఎత్తకుండా ఎమ్మెల్యేలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ…ఎక్కడా ఆయన మాట ప్రస్తావన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఆయన అనుచరగణం ఏదోరకంగా పుట్టా మహేశ్ మళ్లీ జనంలోకి వస్తే పరిస్థితి కొంతైనా మెరుగవుతుందని ఆశిస్తున్నారట. అయితే ఏలూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేయడానికి చాలామంది సీనియర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ పుట్టా మహేశ్కు జరిగిన డ్యామేజ్ కవరయ్యే పరిస్థితి లేకపోవడంతో…పార్టీ నిర్ణయాలు భవిష్యత్తులో వేరేగా ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు వెనకేసుకొచ్చిన జనం…మహేశ్ను అంత పిచ్చిగా నమ్ముతారా అనే అనుమానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అధిష్టానం ఏమాత్రం రిస్క్ చేయదని లెక్కలు కడుతున్నారు కూటమినేతలు. ఎంత అభివృద్ధి చేసిన సొంత ఇమేజ్ దెబ్బతిన్నాక…మళ్లీ కూటమి ప్రయోగాల జోలికి వెళుతుందా అనే చర్చ సైతం ఏలూరులో నడుస్తోందట. నమ్మకమైన నాయకులు, ఆర్థికంగా బలమైన నేతలకి ఏమాత్రం కరువు లేని ఏలూరు పార్లమెంటులో…ఎన్నికల కంటే ముందుగానే మార్పులు చేర్పులపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం అటు కూటమి నేతలకు ఇటు ఎంపీ అనుచర గణానికి ఇబ్బందికరంగా మారిందట. డ్రగ్స్ ఆరోపణల వ్యవహారం సద్దుమణిగాక పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఏలూరు పార్లమెంటు పరిధి నాయకులు ఎలాంటి సపోర్టు ఇస్తారో అనేది కాలమే సమాధానం చెబుతుందని నేతలు చర్చించుకుంటున్నారు.