
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కొత్త పాలకుడు కాల్పులు విరమణ కోరుతూ విజ్ఞప్తి చేశారని తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో బుధవారంనాడు పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిచేంత వరకు ఇరాన్పై భీకర దాడులు కొనసాగుతూనే ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఎప్పుడైతే హర్మూజ్ను తెరుస్తారో అప్పుడు కాల్పుల విరమణ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ త్వరితగతిన లొంగుబాటుకు ముందుకు రాకపోతే రాతియుగం నాటి పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ కొత్త పాలకుడు గత పాలకుడితో పోల్చితే కొంత మేరకు తెలివైన వాడని అధ్యక్షుడు పెజెష్కియాన్ను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
యురోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్తాతో ఫోన్లో మాట్లాడారు. యుద్ధం ముగించాలంటే కొన్ని కీలకమైన అంశాల్లో తమకు హామీలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్లో తమపై తిరిగి ఇలాంటి దాడులు జరగబోవని స్పష్టం చేయాలన్నారు. ఈ అంశాన్ని ఆంటోనియో కూడా ధ్రువీకరించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. తాము అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్తో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమే కానీ అది యుద్ధం ముగింపునకు ఉద్దేశించినవి కావన్నారు. అవి అమెరికాతో అధికార చర్చలు మాత్రం కావన్నారు. మధ్యవర్తుల ద్వారా వస్తున్న సందేశాలకు మాత్రమే స్పందిస్తున్నామన్నారు. తాము కాల్పుల విరమణకు మొగ్గు చూపడం లేదని, యుద్ధ విరమణే కోరుకుంటున్నామన్నారు.