
ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ తో యుద్ధంలో తలమునకలైన ఇరాన్ దేశంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం లీడర్ మజ్తాబా ఖమేనీ క్రియాశీలకంగా లేని పరిస్థితుల్లో.. ప్రసిడెంట్ అధికారాలను నియంత్రించేలా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇరాన్ ప్రభుత్వ అధికారాలను స్వాధీనం చేసుకున్నట్లు పలు నివేధికల ద్వారా తెలుస్తోంది.
ఇప్పటికే యుద్ధ నిర్ణయాలు తీసుకుంటూ యూఎస్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చుక్కలు చూపిస్తున్న IRGC.. ఇరాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. IRGC ఇప్పుడు ఇరాన్కు డి ఫాక్టో రూలర్గా మారింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో తీవ్ర విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో.. IRGC కీలక రాష్ట్ర వ్యవహారాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది.
IRGC అధికారులు అధ్యక్షుడు చేసే నియామకాలను, నిర్ణయాలను బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేసి, సివిల్ ప్రభుత్వాన్ని పూర్తిగా సైడ్లైన్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమెనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయం కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఇరాన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ప్రకారం, IRGC కమాండర్ అహ్మద్ వహీదీ, ఇతర సైనిక నాయకులు అధ్యక్షుడు పెజెష్కియన్ను పూర్తి పొలిటికల్ డెడ్లాక్లోకి నెట్టేశారు. అంటే ఆయన రాజకీయంగా ఎలాంటి అధికారాలను చెలాయించలేని స్థితిలో ఉండి పోవడం.
యుద్ధ సమయంలో దేశ భద్రత, విదేశాంగ వ్యవహారాలు, కీలక నిర్ణయాలు అన్నీ ఇప్పుడు IRGC చేతుల్లోకి వెళ్లాయి. ఈ పరిణామంతో ఇరాన్ సైనిక ఆధిపత్య వ్యవస్థ వైపు మారుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఉన్న పరిస్థితుల్లో IRGC తీసుకున్న నిర్ణయంతో.. ఇరాన్ లో అంతర్గత పోరు మరింత తీవ్రస్థాయికి చేరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.