Reading Time: < 1 minute
Grand Teppotsavam Of Venkateswara Swamy At Vadapalli Mesmerizes Devotees On Godavari

కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తి, శ్రద్ధల సమ్మేళనంగా తెప్పోత్సవం కొనసాగింది. విశేష పూజలతో పాటు, కన్నుల పండుగగా జరిగింది. వేకువజామున ఆలయ అర్చకుల మేల్కొలుపుతో ప్రారంభమైన ఈ మహోత్సవంలో గౌతమి గోదావరి పవిత్ర జలాలను తెచ్చి స్వామివారికి సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం నిత్యార్చన, నిత్య హోమాలు, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం వంటి వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారు అమ్మవార్లకు విశేష పూజారి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది.

సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఎంతగానో అలరించాయి. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రధాన హోమం అనంతరం స్వామివారిని సన్నాయి మేళాల నడుమ గౌతమి గోదావరి తీరం వైపు తీసుకెళ్లి, అంగరంగ వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. నది మధ్యలో సాగిన ఈ తెపోత్సవం భక్తులకు కనుల విందుగా మారి, హృదయాలను భక్తి పరవశంలో ముంచెత్తింది. స్వామివారి కోసం ప్రత్యేకంగా విద్యుత్ పూల అలంకరణలతో రూపొందించిన తెప్ప అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గోదారమ్మ ఒడిలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అందరిని మంత్రముగ్ధులను చేసింది. ఈ పవిత్ర వేడుకల్లో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా విశేషమైన ఏర్పాట్లు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు నృత్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, కోలాటాలు నిర్వహించారు. సమీప ప్రాంతాలు నుంచే కాకుండా సుధీర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఈ కార్యక్రమాలు ఆనందాన్ని, ఉల్లాసాన్ని నింపడంతో పాటు భక్తిని కూడా పెంపొందించాయి. భక్తుల గోవింద నామస్మరణల మధ్య సాగిన ఈ మహోత్సవం కోనసీమ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలిపింది.