Reading Time: < 1 minute
Operation Sindhu Indian Navy Pakistan Strike Admiral Dinesh Tripathi

Operation Sindoor: గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి పాకిస్తాన్‌ను దెబ్బకొట్టింది. దీనికి సంబంధించిన కీలక విషయాన్ని భారత నావికదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే. త్రిపాఠి వెల్లడించారు. ఈ ఆపరేషన్ సమయంలో ఇండియన్ నేవీ పాకిస్తాన్‌పై సముద్రం మార్గం ద్వారా దాడి చేసేందుకు అంతా సిద్ధమైంది, దాడికి కొన్ని నిమిషాల దూరంలో ఉన్నామని చెప్పారు. అయితే, పాకిస్తాన్ దాడుల్ని నిలిపేయాలని అభ్యర్థించడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పారు.

Read Also: CCS meeting: ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోడీ అధ్యక్షతన “సెక్యూరిటీ” మీటింగ్..

ముంబైలో జరిగిన నావికాదళ పురస్కార ప్రదానోత్సవంలో అడ్మిరల్ త్రిపాఠి ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో విశేష సేవలు అందించినందుకు గాను ఇద్దరు సీనియర్ నావికాదళ అధికారులకు ఆయన యుద్ధ సేవా పతకాన్ని కూడా ప్రదానం చేశారు . గతేడాది మే6-7 తేదీల్లో భారత వైమానిక దళం పాకిస్తాన్‌పై భారీ దాడులు నిర్వహించింది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడితే, పాక్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన స్థావరాలను నాశనం చేసింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నేవీ పూర్తిగా అప్రమత్తతతో ఉందని, దాడికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఒక వేళ పరిస్థితి తీవ్రంగా మారి ఉంటే నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ కలిసి భారత్ అతిపెద్ద సైనిక చర్యను ప్రారంభించి ఉండేదని ఆయన మాటల్లో తెలుస్తోంది. మరోవైపు, పశ్చిమాసియా యుద్ధం గురించి అడ్మిరల్ త్రిపాఠి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో 20కి పైగా వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయని చెప్పారు. గతంలో ప్రతిరోజూ సుమారు 130 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 6-7కి పడిపోయిందని ఆయన తెలిపారు.