Reading Time: < 1 minute

గల్ఫ్ యుద్ధంలో ఇరాన్ మరోసారి కువైట్‌పై దాడులు తీవ్రతరం చేసింది. కువైట్ ఎయిర్‌పోర్టు, ఖతార్ పోర్టు వద్ద ఓ చమురు ట్యాంకర్‌పై విరుచుకుపడింది. హర్మూజ్ జలసంధిపై తన పట్టు సడలించడానికి నిరాకరిస్తున్న ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులను విస్తృతం చేసింది. గల్ఫ్ ప్రాంతానికి అమెరికా నుంచి అదనపు బలగాల తరలింపు దశలో ఇరాన్ ఎదురుదాడులతో బుధవారం కువైట్ తల్లడిల్లింది. క్రూయిజ్ మిసైల్స్‌తో దాడులు జరిగాయి. తమ దేశ తీర ప్రాంతంలో ఇరాన్ దాడి జరిగిందని ఖతార్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ ట్యాంకర్ దెబ్బతింది. సిబ్బందిని సురక్షితంగా తరలించారు. దుబాయ్‌కు సమీపంలో కువైట్‌కు చెందిన పూర్తి స్థాయి లోడ్‌తో ఉన్న ట్యాంకర్‌పై దాడులు జరిగాయి.

యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో ఫుజైరా వద్ద ఇరాన్ డ్రోన్ శకలాల ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. బహరైన్‌లో రెండు మూడుసార్లు సైరన్ల మోతలు విన్పించాయి. జోర్డాన్‌లో ఇరాన్‌కు చెందిన రెండు డ్రోన్లను, బాలిస్టిక్ మిస్సైల్‌ను అక్కడి సైన్యం అడ్డుకుంది. సౌదీ అరేబియాలో కూడా ఇరాన్ చర్యను నివారించారు. ఇజ్రాయెల్ బుధవారం టెహరాన్‌లో జరిపిన వైమానిక దాడులలో అక్కడి అమెరికా మాజీ ఎంబసీ కాంపౌండ్ దెబ్బతింది. ప్రస్తుతం ఇక్కడ ఐఆర్‌జిసి బలగాలు ఉంటున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌పై విరుచుకు పడ్డాయి