Reading Time: < 1 minute

సంక్రాంతి పండుగ రోజు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ.277 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ అధికారులు సోమవారం పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను వెంటనే విడుదల చేశారు. ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ అధికారుల ముఖ్యసమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.