Reading Time: < 1 minute
Jeedimetla New Year Celebration Tragedy Suspected Food Poisoning

Hyderabad: జీడిమెట్లలో నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్‌లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాత్రి 17 మంది కలిసి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మద్యం సేవించి బిర్యానీ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా, మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితులను చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. మద్యం లేదా ఆహారంలో ఏదైనా కలుషితం కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

READ MORE: Naveen Chandra : భయానక ప్రపంచంలోకి తీసుకెళ్లిన నవీన్ చంద్ర ‘హనీ’ గ్లింప్స్

మరోవైపు.. హైదరాబాద్‌లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.5,050 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్క రోజే రూ.350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషంగా మారింది. గత ఐదు రోజుల వ్యవధిలోనే రూ.1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే ఒక్క నెలలో రూ.5,000 కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇది ఆల్‌టైం రికార్డ్‌గా పేర్కొంటున్నారు. సర్పంచ్ ఎన్నికల హడావుడి, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గత ఐదు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం లభించింది. మద్యం అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరగడంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల లిక్కర్ సేల్స్ ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని అధికారులు పేర్కొంటున్నారు.