Reading Time: < 1 minute
Ambati Rambabu Slams Government After Meeting Pinnelli Strong Remarks On Police

Ambati Rambabu: పల్నాడు జిల్లాలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా గుంటూరు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా ఆయనతో కలిసి పాల్గొన్నారు. పిన్నెల్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అంబటి రాంబాబు ప్రభుత్వం మరియు పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ కక్షతోనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని కూటమి ప్రభుత్వం 98 రోజుల పాటు జైలులో ఉంచిందని ఆరోపించారు. గుండ్లపాడు ఘటనలో ఒక వర్గానికి చెందిన వారు మరొక వర్గాన్ని హత్య చేసినప్పటికీ, ఆ కేసులో పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించారని పేర్కొన్నారు అంబటి..

Read Also: Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..

రాజకీయంగా తమకు అడ్డుగా ఉన్నారని భావించి టీడీపీ నాయకులు పిన్నెల్లి సోదరులపై తప్పుడు మర్డర్ కేసులు పెట్టారని విమర్శించారు అంబటి. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరియు జూలకంటి బ్రహ్మారెడ్డి కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. అయితే, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. తన ఇంటిపై 7 గంటల పాటు దాడి జరిగినప్పటికీ పోలీసులు స్పందించలేదని, తాను హత్యాయత్నం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు అధికార నాయకులకు బానిసల్లా పనిచేస్తున్నారని, పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే తలుపులు వేసుకుని నిరసన తెలిపే స్థితికి ప్రభుత్వం దిగజారిపోయిందని విమర్శించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఘటనపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇక, ఎక్కడైనా శవం కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఈ కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శిస్తూ, జగన్ నేతృత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.