Reading Time: 2 minutes

IPL vs PSL Debate: కివీస్ కామెంటేటర్ పేరుతో తప్పుడు ప్రచారం.. ఐపీఎల్ vs పీఎస్ఎల్ వివాదంపై క్లారిటీ!

Caption of Image.

IPL vs PSL Debate: ఐపీఎల్ 2026 వర్సెస్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) షెడ్యూల్‌లు ఒకే సమయంలో రావడంతో సోషల్ మీడియాలో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డానీ మోరిసన్ పేరుతో ఒక ఫేక్ పోస్ట్ వైరల్ కావడం సంచలనం సృష్టిస్తుంది. ఒక పాకిస్థానీ క్రికెట్ అభిమాని డానీ మోరిసన్ ఫోటోను ఉపయోగిస్తూ నెట్టింట ఒక ఫేక్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో మోరిసన్ ఐపీఎల్‌పై విమర్శలు చేసినట్లు పేర్కొన్నారు. నేను ఐపీఎల్, పీఎస్ఎల్ రెండింటిలోనూ పని చేశాను. కానీ ఐపీఎల్ కంటే పీఎస్ఎల్‌లోనే క్రికెట్ వాల్యూస్ బాగున్నాయి.. ఐపీఎల్‌లో బుకీల ప్రభావం, అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు నాకు అనిపిస్తోంది.. వచ్చే ఏడాది నన్ను ఎంచుకోమంటే నేను పీఎస్ఎల్‌కే వెళ్తాను అని మోరిసన్ అన్నట్లు ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 

ప్రస్తుతం ఐపీఎల్ 2026 కామెంటరీ ప్యానెల్‌లో ఉన్న డానీ మోరిసన్, ఈ వైరల్ పోస్ట్‌పై తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అబద్ధమని, తన పేరును వాడుకుంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హే @RayhamUnplugged, నా పేరు, ప్రొఫైల్‌ని ఉపయోగించి ఇలాంటి అబద్ధపు సమాచారాన్ని పోస్ట్ చేయడం అస్సలు బాలేదు.. వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పమని సూచించాడు.  
ఈరోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఇలాంటి చెత్త వార్తలు చూడాల్సి రావడం బాధాకరంగా ఉంది. క్రికెట్ అభిమానులందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అది పూర్తిగా ఫేక్ అని డానీ మోరిసన్ స్పష్టం చేశారు.

కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత డానీ మోరిసన్ గతంలో పీఎస్ఎల్‌లో కూడా పని చేశారు. అయితే 2026లో రెండు లీగ్‌లు ఒకేసారి జరుగుతుండటంతో.. ఆయన ఐపీఎల్‌నే ఎంచుకోవడం విశేషం. ఇలాంటి సున్నితమైన సమయంలో అభిమానులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని సృష్టించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలు ఆటగాళ్ల, కామెంటేటర్ల ప్రతిష్టను దెబ్బతీస్తాయి.  

©️ VIL Media Pvt Ltd.