Reading Time: < 1 minute
గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!

సాధారణంగా పండుగలు, పబ్బాలకు ఊరంతా సందడిగా ఉంటుంది. కానీ, కరీంనగర్ జిల్లాలోని గండ్రపల్లి గ్రామం మాత్రం భయం గుప్పిట్లో వింత నిర్ణయం తీసుకుంది. గత మూడు నెలల్లో ఏకంగా 28 మంది వివిధ కారణాలతో మృతి చెందడంతో, గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన ప్రజలు ఊరు విడిచి అడవి బాట పట్టారు. గండ్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. వృద్ధులే కాకుండా యువకులు కూడా మరణిస్తుండటంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. గ్రామంలో ఏదో అరిష్టం దాగి ఉందని, అందుకే ఇన్ని చావులు జరుగుతున్నాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ మరణాల పరంపరకు ముగింపు పలకాలని గ్రామ పెద్దలు, పురోహితులను ఆశ్రయించారు.

గ్రామ జాతకాన్ని పరిశీలించిన పురోహితుడు, గ్రామానికి తీవ్రమైన కీడు సోకిందని, దానిని వదిలించుకోవాలంటే అందరూ కలిసి కీడు వంటలు నిర్వహించాలని సూచించారు. పురోహితుడి ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే గ్రామంలో డప్పు చాటింపు వేశారు. గురువారం తెల్లవారుజామునే గ్రామస్తులందరూ తమ ఇళ్లకు తాళాలు వేసి, పిల్లాపాపలతో కలిసి గ్రామ పొలిమేరల వెలుపలికి వెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా వంటలు చేసుకుని, దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సమయంలో గండ్రపల్లి గ్రామం నిర్మానుష్యంగా, పాడుబడినట్లుగా కనిపించింది.

ఒకవైపు గ్రామస్తులు తమ విశ్వాసాల ప్రకారం పూజలు చేస్తున్నప్పటికీ, మరోవైపు మరణాల వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామంలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. ఈ మరణాలు కలుషిత నీరు, ఏదైనా అంటువ్యాధి లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల జరుగుతున్నాయా అనేది నిపుణులు తేల్చాల్సి ఉంది. మూఢనమ్మకాలతో భయపడకుండా, సరైన వైద్యం పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..