
Mitchell Santner: ఐపీఎల్ 2026 సీజన్ ఎనిమిదో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకుని జట్టు శిబిరంలో చేరినట్లు సమాచారం. గత మ్యాచ్లో కోల్కతాపై ముంబై గెలిచినప్పటికీ, బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో శాంట్నర్ రాక హార్దిక్ పాండ్యా సేనకు కొండంత అండగా మారనుంది.
అల్లా మహమ్మద్ గజన్ఫర్ స్థానంలో మార్పు..?
కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా మహమ్మద్ గజన్ఫర్ తీవ్రంగా నిరాశపరిచారు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 51 పరుగులు ఇచ్చాడు. దీంతో ఢిల్లీతో జరిగే మ్యాచ్లో గజన్ఫర్ స్థానంలో శాంట్నర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. శాంట్నర్ జట్టులోకి వస్తే స్పిన్ విభాగం పటిష్టమవ్వడమే కాకుండా, బ్యాటింగ్ లోనూ లోయర్ ఆర్డర్లో జట్టుకు లోతు పెరుగుతుంది.
అద్భుతమైన ఫామ్లో కివీస్ కెప్టెన్..
మిచెల్ శాంట్నర్ ప్రస్తుత ఫామ్ ముంబై జట్టుకు ప్రధాన బలం. టీ20 క్రికెట్లో పొదుపుగా బౌలింగ్ చేయడంలో ఆయన దిట్ట. 2020 నుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా ఆయన ఎకానమీ రేటు ఎనిమిది కంటే తక్కువగా ఉండటం విశేషం. 138 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో 142 వికెట్లు తీసిన అనుభవం ఆయనకు ఉంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో కూడా శాంట్నర్ కేవలం 6.57 ఎకానమీతో అద్భుతంగా బౌలింగ్ చేశారు.
ముంబై జట్టులో శాంట్నర్ ప్రస్థానం..
గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన శాంట్నర్, అక్కడ తక్కువ అవకాశాలు పొందే వారు. అయితే ఐపీఎల్ 2025 వేలంలో ముంబై ఇండియన్స్ ఆయనను 2 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. 2025 సీజన్లో ముంబై తరపున 13 మ్యాచ్లు ఆడిన ఆయన 10 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం 34 ఏళ్ల వయసులో ఉన్న శాంట్నర్, తన అనుభవంతో ఢిల్లీ పిచ్పై ముంబైకి విజయాన్ని అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరో విదేశీ ఆటగాడు విల్ జాక్స్ కూడా త్వరలోనే జట్టుతో చేరాల్సి ఉంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..