
Abhishek Sharma Catch Controversy: ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. వరుణ్ చక్రవర్తి పట్టిన క్యాచ్ కారణంగా మ్యాచ్లో డ్రామా చోటు చేసుకుంది.. ఈ క్యాచ్పై థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్లో తొమ్మిదో ఓవర్లో ఈ సంఘటన జరిగింది. బ్లెస్సింగ్ ముజారాబాని వేసిన బంతిని అభిషేక్ శర్మ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, టైమింగ్ కుదరక బంతి డీప్ స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న వరుణ్ చక్రవర్తి వేగంగా స్పందించి నేలకు అతి దగ్గరగా ఉన్న బంతిని అందుకున్నాడు.
Read Also: Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..
మైదానంలో ఉన్న ఆటగాళ్లు క్యాచ్ క్లీన్గా పట్టినట్లు సంబరాలు చేసుకున్నారు. అయితే, అభిషేక్ శర్మ మాత్రం ఆ నిర్ణయంపై సందేహం వ్యక్తం చేశాడు. దీంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ నితిన్ మీనన్కు పంపించారు. రీప్లేలు పరిశీలించినప్పుడు మొదట క్యాచ్ క్లీన్గా కనిపించినా, జూమ్లో చూసినప్పుడు బంతి నేలను తాకి పైకి ఎగిరినట్లు అనుమానం కలిగింది. దీంతో నిర్ణయం క్లిష్టంగా మారింది. అయినప్పటికీ ఫీల్డర్ వేళ్లు బంతి కింద ఉన్నాయని భావించిన థర్డ్ అంపైర్ నితిన్ మీనన్, అభిషేక్ శర్మను ఔట్గా ప్రకటించారు.
ఈ నిర్ణయంపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోచ్ డేనియల్ వెట్టోరి కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 పరుగులు చేసి అర్ధశతకం దగ్గరలో ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టి ఆకట్టుకున్నాడు. ఈ కీలక వికెట్తో కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో తిరిగి ఆధిపత్యం సాధించింది. అయితే ఈ క్యాచ్పై వివాదం మాత్రం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.