
Vastu Tips: వేసవి సమయంలో సామాన్యుడి ఫ్రిజ్గా మట్టి కుండలకు పేరు ఉంది.. ఇక చాలా మంది ఫ్రిజ్ వాటర్ తీసుకోవడం ఇష్టం లేనివారు కూడా మట్టి కుండలను తీసుకోవడం చూస్తుంటాం.. వేసవి కాలంలో మట్టి కుండలు ఉపయోగించడం శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా, వాస్తు పరంగా కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా వైశాఖ మాసంలో ఇంట్లో చేసే చిన్న మార్పులు సానుకూల శక్తిని పెంచి, ఆర్థిక శ్రేయస్సును తీసుకువస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు కూడా మీ ఇంట్లో సుఖశాంతులు, సంపద పెరగాలని కోరుకుంటే ఈ సులభమైన వాస్తు చిట్కాలను పాటించడం మంచిది అంటున్నారు వాస్తు నిపుణులు..
* మొదటిగా, ఇంటి ఈశాన్య దిశలో మట్టి కుండను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శుభ్రమైన నీటితో నింపిన మట్టి కుండను ఈశాన్యంలో ఉంచితే ఇంట్లో చల్లదనం, ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది ఆర్థిక స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని నమ్మకం.
* వైశాఖ మాసంలో తులసి మొక్కకు ప్రత్యేక పూజ చేయడం ఎంతో మంగళకరంగా భావిస్తారు. ప్రతి ఉదయం తులసి మొక్కకు నీరు పోయడం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. దీని వల్ల ప్రతికూల శక్తి తగ్గి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
* ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉత్తర దిశలోని ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. పనికిరాని వస్తువులను తొలగించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి సులభంగా ప్రవహిస్తుంది. చిందరవందరగా ఉన్న ప్రదేశాల్లో మంచి శక్తి నిలవదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
* మనీ ప్లాంట్ను ఇంట్లో ఉంచడం కూడా శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. దీనిని నీటితో నింపిన గాజు పాత్రలో పెట్టి ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద, అభివృద్ధి పెరుగుతాయని చెబుతారు. ఇది మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది.
* ఇక, ప్రతి ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లడం కూడా ఒక మంచి అలవాటు. ఇది ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తుంది. కావాలంటే ప్రవేశ ద్వారం దగ్గర నీటితో నింపిన రాగి పాత్రను ఉంచుకోవచ్చు. ఇలా.. ఈ చిన్నచిన్న వాస్తు మార్పులు పాటిస్తే, మీ ఇంట్లో సుఖశాంతులు, ఆర్థికాభివృద్ధి పెరిగి జీవితం మరింత సంతోషంగా మారుతుంది.