
Rajnath Singh: ఇరాన్ యుద్ధం నీడలో ఎలాంటి ‘‘దుస్సాహసానికి’’ పాల్పడొద్దని పాకిస్తాన్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఏడాది పూర్తవుతున్న కొద్ది రోజుల ముందు ఆయన నుంచి ఈ వార్నింగ్ వచ్చింది. కేరళలో జరుగుతున్న సైనిక్ సమ్మాన్ సమ్మేళనంలో రాజ్నాథ్ మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలోని అశాంతిని అవకాశంగా తీసుకుని పాకిస్థాన్ అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే, భారతదేశం యొక్క ప్రతిస్పందన “నిర్ణయాత్మకంగా” ఉంటుందని అన్నారు.
Read Also: Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..
ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే, మన పొరుగుదేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడొచ్చని, అలా జరిగితే భారత్ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఏప్రిల్ 22న కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు హత్య చేయబడిన తర్వాత, భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది.
ఉరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, ఇప్పుడు ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదాన్ని గట్టి దెబ్బ కొట్టామని రాజ్నాథ్ సింగ్ అననారు. ఢిల్లీలో ఇటీవల పాకిస్తానీ పౌరులు పట్టుబడిన తర్వాత, పాకిస్తాన్ మీడియా తమ దేశంపై భారత్ ఒక ఆపరేషన్కు సిద్ధమవుతుందని ఆరోపించిన తర్వాత రాజ్నాథ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. అమెరికా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి ఆపరేషన్ చేయడానికి భారత్ ప్లాన్ చేస్తుందని పాకిస్తానీ దినపత్రిక ది డాన్ నివేదించింది.