
Iran: ఇజ్రాయిల్, అమెరికా తమపై దాడులు చేసినప్పటికీ, హార్ముజ్ జలసంధి గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇరాన్ చెప్పింది. ఫిబ్రవరి 28న యూఎస్, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. దీని తర్వాత ఇరాన్ కీలకమైన నౌకామార్గమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇరాన్ అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక కూడా ఈ ఇరుకైన జలమార్గాన్ని దాటలేకపోతోంది. మరోవైపు, ఇజ్రాయిల్ -యూఎస్తో సంబంధాలు ఉన్న నౌకలతో పాటు అనుమతి లేని నౌకలపై ఇరాన్ దాడి చేస్తోంది. ప్రపంచంలో 20 శాతం చమురు ఈ మార్గం గుండానే సరఫరా అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరాన్ భారతదేశానికి స్నేహ సందేశాన్ని పంపించింది. ‘‘ మా భారతీయ మిత్రులు సురక్షితంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు’’ అని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం గురువారం ఎక్స్లో పోస్ట్ చేసింది. గత నెలలో యుద్ధం ప్రారంభమైన తర్వాత కొన్ని నౌకలు మాత్రమే ఈ మార్గాన్ని దాటాయి. భారతదేశం, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్తో సహా “స్నేహపూర్వక దేశాలను” హోర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతించినట్లు ఇరాన్ తెలిపింది. ఇప్పటి వరకు హార్ము జ్ గుండా 8 నౌకలు భారత్ వచ్చాయి. వీటిలో 94,000 టన్నుల ఎల్పీజీ ఉంది. భారత్కు ఎల్పీజీ, ముడి చమురుతో రావాల్సిన 19 నౌకలు ప్రస్తుతం హార్ముజ్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.