Reading Time: < 1 minute
Yuvraj Singh Apologizes Ms Dhoni Kapil Dev Yograj Singh Controversial Comments

భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్న సమయంలోనే యువరాజ్ సింగ్ తనదైన ముద్ర వేశారు. 2000 నుంచి 2015 వరకు భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయాలైన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించారు. అయితే.. అదే సమయంలో ధోనీ కెప్టెన్‌గా ఉండటంతో యువరాజ్‌కు ఎక్కువ కాలం జట్టును నడిపించే అవకాశం రాలేదు.

యువరాజ్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత.. అతని తండ్రి యోగ్ రాజ్ సింగ్ పలు సందర్భాల్లో ఎంఎస్ ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యువరాజ్‌కు కెప్టెన్సీ రాకపోవడానికి ధోనీయే కారణమని ఆయన ఆరోపించేవారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ టీజర్‌లో యువరాజ్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. ‘నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’ అని అన్నారు. తన తండ్రి ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుందని అడగ్గా.. ‘అది సరైంది కాదని మా నాన్నకు చెప్పాను’ అని యువీ పేర్కొన్నారు.

Also Read:Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

యోగ్ రాజ్ సింగ్ గతంలో కపిల్ దేవ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 1980లలో తనను జట్టు నుంచి తొలగించినందుకు కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కపిల్ దేవ్ కెప్టెన్ అయినప్పుడు నన్ను అనవసరంగా జట్టులోంచి తీసేశారు. అప్పట్లో నా పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లాను. అతని తల్లి అక్కడ ఉండటంతో వదిలేశాను. ఆ రోజే నేను క్రికెట్ ఆడకూడదని, నా కొడుకు యువీతో ఆడిస్తానని నిర్ణయించుకున్నాను’ అని యోగ్ రాజ్ పాత విషయాలను గుర్తు చేసుకున్నారు.

బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి వారు ఆటగాళ్లను సరిగ్గా గౌరవించలేదని, మన కెప్టెన్ల వల్లే జట్టు నాశనమైందని ఆయన బహిరంగంగా విమర్శలు చేసేవారు. అయితే తన తండ్రి చేస్తున్న ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యల పట్ల యువరాజ్ సింగ్ ఇప్పుడు క్షమాపణలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.