
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం శుభపరిణామమని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడంతో రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఆనందకరమైన సందర్భమని ఆయన అన్నారు. ఇకపై అమరావతి రాజధానిగా అజేయమని స్పష్టం చేశారు.. ఈ బిల్లుకు మద్దతు పలికిన అన్ని రాజకీయ పక్షాలకు, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఇకపై అపోహలను విడిచిపెట్టి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..
రాజధాని అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్న వారిని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు పవన్.. అలాంటి వ్యాఖ్యలు చేసే వారి నైజం ప్రజలకు స్పష్టమవుతోందని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రజలందరికీ చెందే రాజధానిగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఈ బిల్లును ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత లభించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించి ఆనందాన్ని పంచుకోవాలని కోరారు.