Reading Time: < 1 minute

ఐపిఎల్ సీజన్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో కేవలం 161 పరుగులకే కుప్పకూలింది. రఘువంశీ 29 బంతుల్లోనే 52 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఫిన్ అలెన్ 7 బంతుల్లోనే 28 పరుగులు సాధించాడు. కెప్టెన్ రింకు సింగ్ (35) తప్ప మిగతా వారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కట్ మూడు, నితీశ్, మలింగ రెండేసి వికెట్లను పడగొట్టారు.

మెరుపు ఆరంభం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు తొలి బంతి నుంచే చెలరేగి పోయారు. భారీ షాట్లతో కోల్‌కతా బౌలర్లను హడలెత్తించారు. వీరిని కట్టడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు హెడ్ అటు అభిషేక్‌లు తమ మార్క్ షాట్లతో అలరించారు. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో స్కోరు సునామీల పరిగెత్తింది. చెలరేగి ఆడిన హెడ్ 21 బంతుల్లోనే ఆరు బౌండరీలు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలోనే 82 పరుగులు జోడించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 3 ఫోర్లతో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడిన అభిషేక్ 21 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన హెన్రిచ్ క్లాసెన్ (52) పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి (39) పరుగులు చేయడంతో హైదరాబాద్ భారీ స్కోరు నమోదు చేసింది.