Reading Time: < 1 minute
Serial Bride Scam Exposed In Ichapuram Unmarried Youth Targeted In Marriage Fraud

Marriage Fraud: పెళ్లి ప్రతీ వ్యక్తి జీవితంలో కీలకమైన ఘట్టం.. దీని కోసమే ఉద్యోగం, ఉపాధి.. తన ఫ్యూచర్‌.. తన ఫ్యామిలీ.. ఇలా ప్లానింగ్‌ చేసుకుంటారు.. అయితే, పెళ్లి పేరుతో కూడా మోసం చేసేవారు లేకపోలేదు.. పెళ్లి కానీ యువకులే లక్ష్యంగా మధ్యవర్తుల సహకారంతో వరుస పెళ్లిళ్లకు జెండా ఊపుతున్న నిత్య వధువు గుట్టు రట్టయింది. పెళ్లి చేసుకోవడం కొద్దిరోజులకు అక్కడి నుంచి తప్పించుకొని మరో పెళ్లి చేసుకోవడం నిత్య కృత్యంగా మారిన ఇచ్చాపురానికి చెందిన ఒక యువతి మోసం చివరికి బయటపడడంతో బాధిత పెళ్ళికొడుకు న్యాయం కోసం. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

Read Also: Varun Sandesh: రెండో సినిమాకే డైరెక్టర్ గా మారిన హీరోయిన్

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇచ్చాపురం పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి వాణి తల్లి చనిపోవడం, తండ్రి రోడ్డు పాలు కావడంతో తన బంధువులు దగ్గర ఉంటూ పెరిగింది. ఇతర ప్రాంతాలకు చెందిన పెళ్లికాని యువకులను వాణితో పెళ్లి చేసి లక్షలు వసూలు చేసే కార్యక్రమానికి ఇచ్చాపురానికి చెందిన ముగ్గురు మహిళలు తెర తీశారు. మహిళలు యువకులను ఎంపిక చేసి పెళ్లి చేసి లక్షల రూపాయలు వసూలు చేసి, వాణితో కలిసి పంచుకుంటారు. కొంతకాలం తర్వాత వాణి అక్కడి నుంచి జారుకుంటుంది. మరలా ఇంకో పెళ్లి చేస్తారు. ఈ తంతు ఇలాగే సాగుతూ ఉంటుంది. అయితే వారం కిందట తనతో వివాహం చేసుకున్న వాణి తన నుండి పారిపోయి వెళ్లిపోయిందని, జరిగిన విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చానని తాజాగా మోసపోయిన కర్ణాటకకు పెళ్ళికొడుకు సురేష్ పోలీసులు వద్ద వాపోయాడు. పోలీసులు వాణిని పిలిపించి కౌన్సిలింగ్ చేశారు.

అయితే, తాను గతంలో ఒక పెళ్లి మాత్రమే చేసుకున్నానని, మరో రెండు నిశ్చితార్ధాలు చేసుకున్నానని, మధ్యవర్తుల సహకారంతో డబ్బుకు ఆశపడి పెళ్లిళ్లు చేసుకున్నట్లు వాణి పోలీసుల వద్ద అంగీకరించిందట.. కానీ, ఇతరుల ఆరోపిస్తున్నట్లు 8 వివాహాలు చేసుకోలేదని వివరించింది. తమ వద్ద తీసుకున్న డబ్బులు ఇప్పించాలని బాధిత పెళ్ళికొడుకు పోలీసులను అభ్యర్థించాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు వారిని సుదీర్ఘంగా కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఈ సమస్య ఇంకా ఒక కొలిక్కి రావలసి ఉంది.