
రహదారి పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెంటపాడు గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. పెంటపాడు గ్రామానికి చెందిన మహిళలు పాంగి సావిత్రి,కొర్ర సుశీల రహదారి పక్కన రోజూ కూరగాయలు అమ్ముతుంటారు. ఈ క్రమంలో రింతాడ గ్రామనికి చెందిన ఉపాధ్యాయుడు తన కారులో చింతపల్లి నుంచి రింతాడకు వెళ్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కొర్ర సుశీల ఘటనాస్థలిలోనే మృతి చెందింది. సావిత్రి తీవ్రంగా గాయపడింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.