
- యుద్ధం ఆగుతుందనే ఆశతో ర్యాలీ
- మెరిసిన బ్యాంక్, మెటల్, ఐటీ షేర్లు
- ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు జంప్
ముంబై: ఇండియా స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని లాభాలతో మొదలు పెట్టాయి. గత కొన్ని సెషన్లుగా పడిన బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం ర్యాలీ చేశాయి. ఇరాన్–అమెరికా యుద్ధం ముగుస్తుందనే సంకేతాలతో రోజంతా లాభాల్లో కదిలాయి. కానీ, అమెరికా నాటో నుంచి బయటకు వచ్చేస్తుందనే భయాలు లాభాలను పరిమితం చేశాయి. ఇంట్రాడేలో రెండున్నర శాతం వరకు పెరిగిన నిఫ్టీ, చివరికి 1.60 శాతం లాభంతో ముగిసింది.
గ్లోబల్ మార్కెట్ల నుంచి సపోర్ట్ దొరకడంతో బుధవారం 348 పాయింట్లు పెరిగి 22,679 వద్ద క్లోజ్ అయ్యింది. ఇంట్రాడేలో 22,940 వరకు ర్యాలీ చేసింది. సెన్సెక్స్ 1,187 పాయింట్లు పెరిగి 73,134 వద్ద సెటిలయ్యింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్లు గ్రీన్లో ముగియగా, ఇన్వెస్టర్లు సంపద రూ.10 లక్షల కోట్లు ఎగిసింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.422 లక్షల కోట్లకు చేరింది. ట్రెంట్, ఇండిగో, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్బీఐ, ఎటర్నల్, లార్సెన్ అండ్ టూబ్రో 4–-7 శాతం పెరిగి టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఎన్టీపీసీ, సన్ ఫార్మా ఒక శాతం చొప్పున తగ్గాయి.
నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ మీడియా ఇండెక్స్లు 4 శాతం పెరగగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్లు 2.50 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా ఒక శాతం పడిపోయింది. ఎన్ఎస్ఈలో 2,936 షేర్లు లాభాల్లో, 283 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే ఇండియా విక్స్ 11 శాతం తగ్గి 25 కి పడిపోయిందని ట్రేడర్లు చెప్పారు.
ఘర్షణలు ముగుస్తాయని…
యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు-మూడు వారాల్లో ఇరాన్పై దాడులు ఆపేస్తామని, ఇరాన్ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా యుద్ధం ముగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ భవిష్యత్తులో దాడులు జరగకుండా హామీ కావాలని అన్నారు.
గ్లోబల్ మార్కెట్ల ర్యాలీ
జపాన్ నిక్కీ బుధవారం 5శాతం, సౌత్ కొరియా 8శాతం పెరిగాయి. యూరప్ మార్కెట్లు కూడా 2శాతం వరకు లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం సెషన్లో పెరిగాయి. ఎస్ అండ్ పీ 500 సుమారు 3శాతం, నాస్డాక్ 4శాతం, డౌ జోన్స్ 2.5శాతం లాభపడ్డాయి.
తక్కువ వాల్యుయేషన్స్
ఈ ఏడాది మార్చిలో నిఫ్టీ 11శాతం పడిపోయింది. దీంతో వాల్యుయేషన్స్ తగ్గాయి. క్వాలిటీ షేర్లు మంచి వాల్యుయేషన్ దగ్గర దొరుకుతుండడంతో ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. యుద్ధం ఆగిపోతుందనే సంకేతాలు రాగానే కొనేందుకు ఆసక్తి చూపించారు. నిఫ్టీ ఇప్పుడు 19 రెట్ల పీఈలో ట్రేడ్ అవుతోంది.
అప్రమత్తత అనివార్యం
మార్కెట్ బుధవారం భారీగా పెరిగినప్పటికీ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) వరుసగా 21 వ రోజు కూడా నికర అమ్మకందారులుగా నిలిచారు. సుమారు రూ.8,300 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. రూపాయి డాలర్తో 5 పైసలు బలపడి 94.77 దగ్గర క్లోజయ్యింది. అయినప్పటికీ ఇంకా తన జీవిత కాల కనిష్టాల దగ్గర ఉంది. అందువల్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు.
రూ.9 వేలు పెరిగిన వెండి.. పసిడి ధర రూ.3,500 జంప్
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలత వల్ల బుధవారం కిలో వెండి ధర రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలకు చేరింది. గత సెషన్లో రూ.2.37 లక్షలుగా ఉన్న వెండి 3.8 శాతం మేర వృద్ధి చెందింది. పది గ్రాముల బంగారం ధర రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షలకు చేరుకుంది. క్రితం సెషన్ లో రూ.1,51,500 వద్ద ముగిసింది. యుద్ధంతీవ్రత, చమురు ధరల తగ్గుదల వల్ల పసిడి ధరలు పెరిగాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం ధర దాదాపు 61 శాతం, వెండి 131 శాతం పెరిగింది.