Reading Time: < 1 minute

 బంగ్లాదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మరో హిందూ యువకుడిని సజీవ దహనం చేశారు. గ్యారేజీలో నిద్రిస్తున్న యువకుడికిపై అల్లరిమూక ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన నార్సింగ్డి ప్రాంతంలో జరిగింది. శుక్రవారం రాత్రి ఓ గ్యారేజ్‌పై అల్లరి మూకలు దాడి చేశారు. షట్టర్ మూసివేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ సమయంలో గ్యారేజ్‌లో నిద్రిస్తున్న చంచల్ భౌమిక్(23) అనే యువకుడు సజీవ దహనం అయ్యాడు. చంచల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అల్లరి మూక అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడికి తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరు దివ్యాంగుడు. చంచల్ తండ్రి చాలా కాలం క్రితం చనిపోయారు. ప్రస్తుతం చంచల్ సంపాదనపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. అల్లరిమూక పథకం ప్రకారమే చంచల్ ని బంధించి హత్య చేశారని గ్యారేజ్ యజమాని తెలిపాడు. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై బంగ్లాలోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.