Reading Time: < 1 minute

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు వాహనదారులకు భారీ ఉపశమనం కలిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.రోడ్లపై వాహనాలను ఆపి పెండింగ్ చలాన్లు ఉన్నాయనే నెపంతో పోలీసుల బలవంతపు వసూళ్లను హైకోర్టు తప్పుపట్టింది. వాహనదారులు తమంతట తాముగా చెల్లిస్తేనే తీసుకోవాలని, లేదంటే చట్టపరమైన నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. తనిఖీల సమయంలో పోలీసులు వాహనాల తాళాలు లాక్కోవడం లేదా వాహనాలను సీజ్ చేయడం వంటి చర్యలకు పాల్పడకూడదని కోర్టు ఆదేశించింది. ఇలా చేయడం పౌరుల హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడింది.చలాన్ విధించినప్పుడు అది ఏ నిబంధన కింద,

మోటారు వాహనాల చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం వేశారో స్పష్టంగా పేర్కొనాలని గతంలోనే కోర్టు సూచించింది. కేవలం ఫోటో తీసి జరిమానా వేయడం కాకుండా, నిబంధనల ఉల్లంఘనపై స్పష్టత ఉండాలని పేర్కొంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన భారీ డిస్కౌంట్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలా రాయితీలు ఇవ్వడం వల్ల ప్రజల్లో చట్టం పట్ల భయం పోతుందని, క్రమశిక్షణా రాహిత్యం పెరుగుతుందని వ్యాఖ్యానించింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులు పిటిషన్ దాఖలైంది. దీనిపై లాయర్ విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.