Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని అంశాలపై సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తెలంగాణలో శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అంశాలపై ఆదివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు నీటి పారుదల శాఖకు చెందిన అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నదీ జలాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. నదీ జలాల్లో వాటా, ఏపీతో వివాదాలు, బీఆర్‌ఎస్ హయాంలో అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో అందుకు సంబంధించిన అన్ని అంశాలపై దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటి నుంచి పరిణామాలు, బీఆర్‌ఎస్ హయాంలో నిర్ణయాలు, పురోగతి, గత రెండేళ్లుగా పనులు ఇలా అన్ని వివరాలు తీసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై గురువారం ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్న ప్రజెంటేషన్‌కు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.