Reading Time: < 1 minute

సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో టి20లో ఆతిథ్య టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 21 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. గిల్ సమన్వయంతో ఆడగా అభిషేక్ దూకుడును ప్రదర్శించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 18 బంతుల్లోనే 3 సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ క్రమంలో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన తిలక్‌వర్మతో కలిసి పోరాటం కొనసాగించాడు. శుభ్‌మన్ గిల్ 5 ఫోర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) మరోసారి నిరాశ పరిచాడు. అయితే శివమ్ దూబే 10(నాటౌట్)తో కలిసి తిలక్‌వర్మ జట్టును గెలిపించాడు. తిలక్ అజేయంగా 25 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. అర్ష్‌దీప్, వరుణ్, హర్షిత్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. సఫారీ టీమ్‌లో మార్‌క్రమ్ (61), ఫెరీరా (20) మాత్రమే రాణించారు.