
ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ తప్పనిసరి బాధ్యత
నిర్లక్ష్యం చేస్తే అది చారిత్రక తప్పిదమే
మండలిలో ఎంఎల్సి విజయశాంతి ఆవేదన
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమంపై శాసనమండలిలో ఎంఎల్సి విజయశాంతి తన గళం వినిపించారు. ప్రభుత్వంపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సోమవారం ఆమె సభలో మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే, ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఉండేవారా? అని ప్రశ్నించారు. పదవుల కంటే ముందు వారి త్యాగాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు వివిధ సందర్భాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులను ఆదుకోవడమనేది ప్రభుత్వ తప్పనిసరి బాధ్యత అని అన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తిస్తే అది చరిత్రగా నిలుస్తుంది. లేని పక్షంలో వారిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు.
ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ సైతం ఇచ్చామని ప్రభుత్వానికి వివరించారు. ఉద్యమకారులకు మనం తొలి ప్రాధాన్యం ఇస్తామని భరోసా కూడా ఇచ్చామన్నా . ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు తమను ప్రశ్నిస్తున్నారని శాసనమండలి వేదికగా ఎంఎల్సి విజయశాంతి వివరించారు. ఉద్యమ
కారులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి జూన్ 2వ తేదీ నాటికి వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చామని అది కూడా ఇంకా నెరవేరలేదని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని విజయశాంతి ప్రభుత్వానికి ఆమె సూచించారు.